డార్క్ డే: రాజ్యాంగ వ్యవస్థలో చీకటిరోజు: సోనియాగాంధీ.. !
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించడంపై అఖిల భారత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడాన్ని భారత రాజ్యాంగ వ్యవస్థలో చీకటి దినంగా ఆమె అభివర్ణించారు. సంకుచిత భావాలు గల కొందరు వ్యక్తులకు మాత్రమే సాధించిన విజయంగా ఆమె పేర్కొన్నారు. ఇలాంటి చీకటి రోజులు ఎంతో కాలం పాటు కొనసాగబోవని అన్నారు.

అనుకూలంగా 125, ప్రతికూలంగా 105
పౌరసత్వ సవరణ బిల్లును బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. బిల్లుకు అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేశారు. బిల్లుకు ప్రతికూలంగా 105 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లుపై ఓటింగ్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తి భిన్న వైఖరిని అనుసరించాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వ్యవహరించింది. శివసేన ఓటింగ్ ను బహిష్కరించింది.

ఆరు గంటల పాటు వాడివేడిగా..
పౌరసత్వ సవరణ బిల్లుపై సుమారు ఆరు గంటల పాటు వాడివేడిగా చర్చలు సాగాయి. ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య రోజంతా చర్చ కొనసాగింది. రాత్రి 9 గంటల వరకూ పెద్దల సభ నడిచింది. మధ్యాహ్న భోజన విరామ సమయాన్ని కూడా తీసుకోకుండా.. చర్చను కొనసాగించిందటే.. దీనికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్ష పార్టీల సభ్యులు బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. తమ వైఖరిని స్పష్టం చేశారు.

ఎంపిక కమిటీకి పంపించడంపైనా ఓటింగ్..
పౌరసత్వ సవరణ బిల్లును ఎంపిక కమిటీకి పంపించడంపైనా ఓటింగ్ నిర్వహించారు. వివాదాస్పదమైన ఈ బిల్లును ఎంపిక కమిటీకి పంపించాలనే తీర్మానాన్ని సీపీఎం సభ్యుడు కేకే రాగేష్ రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. దీనిపై ఓటింగ్ నిర్వహించారు. ఇక్కడ కూడా ఓటింగ్ వీగి పోయింది. ఈ బిల్లును ఎంపిక కమిటీకి పంపించకూడదంటూ మెజారిటీ సభ్యులు ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా.. అది ఆమోదం పొందింది.












Click it and Unblock the Notifications