పౌరసత్వ నిరూపణకు 16 డాక్యుమెంట్లు ఇచ్చిన పిటిషనర్-అయినా నో అన్న హైకోర్టు..!
మన దేశంలో పౌరసత్వం (Citizenship) నిరూపణ రాబోయే రోజుల్లో తీవ్ర కష్టసాధ్యంగా మారబోతోందన్న అంశాన్ని నిరూపించేందుకు తాజాగా ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐఆర్ లో ఓటు హక్కు కోల్పోయిన వ్యక్తి తాను ఈ దేశ పౌరుడినే అని నిరూపించుకునేందుకు ఏకంగా 16 డాక్యుమెంట్లు (ఆధారాలు) సమర్పించారు. అయినా హైకోర్టు అతని వాదనను తిరస్కరించింది. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
తాజాగా ఓ వ్యక్తి తన పౌరసత్వ నిరూపణకు ఏకంగా 16 ఆధారాలు సమర్పించినా, తనను తాను భారతీయ పౌరుడిగా నిర్ధారించుకోలేకపోయారని గౌహతి హైకోర్టు తీర్పు ఇచ్చింది. 'ఫారినర్స్ యాక్ట్, 1964'లోని సెక్షన్ 9 ప్రకారం, తాను విదేశీయుడిని కాదని, భారతీయ పౌరుడినని నిరూపించుకోవడంలో ఈ 16 పత్రాలు పిటిషనర్కు ఏమాత్రం సహాయపడలేదని హైకోర్టు తెలిపింది. ఒక వ్యక్తి విదేశీయుడా కాదా అనే ప్రశ్న తలెత్తినప్పుడు, తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

అమీనుల్ హక్ అనే వ్యక్తిని గౌహతిలోని ఫారినర్స్ ట్రిబ్యునల్ 2019 ఫిబ్రవరి 28న విదేశీయుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన ఉత్తర్వును అతను హైకోర్టులో సవాలు చేశాడు.హక్ తన తాతామామలు, తండ్రి పేర్లు నమోదైన 1951 నాటి జాతీయ పౌరుల రిజిస్టర్ (NRC) కాపీలు, 1966 నుండి 2017 వరకు తన తల్లిదండ్రుల, తన పేర్లు ఉన్న ఓటర్ల జాబితాల ధృవీకరించిన కాపీలు, 1973 నాటి భూమి కొనుగోలు పత్రాలు, పాన్ కార్డు, ఓటర్ ఐడిలు, పాఠశాల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాడు. అస్సాంలో ఎన్నార్సీ ప్రక్రియ 2019లో పూర్తయినప్పటికీ, దానిని ఇంకా అధికారికంగా నోటిఫై చేయలేదు. ఈ నేపథ్యంలో తన కుటుంబం తరతరాలుగా అస్సాంలో నివసిస్తోందని పిటిషనర్ వాదించాడు. అయినా హైకోర్టు అతన్ని పౌరుడిగా నిర్ధారించకుండా పిటిషన్ తోసిపుచ్చింది.














Click it and Unblock the Notifications