సీఏఏ: భారత్ను ఏకాకిని చేస్తుందంటూ శివశంకర్ మీనన్ హెచ్చరిక
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై భారత మాజీ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏని భారత స్వయంకృత అపరాధంగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు స్పందించారు.
సీఏఏ భారతదేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేస్తుందని శివశంకర్ మీనన్ వ్యాఖ్యానించారు. భారతదేశ ఆలోచనను మనం మార్చాలనుకుంటే ఫలితంగా తలెత్తే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
పౌరసత్వ సవరణ చట్టం పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైన్, బౌద్ధులు, పార్శీ మతస్తులకు లబ్ధి చేకూర్చుతుందని అన్నారు. అయితే, ఈ చట్టం వల్ల ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు.
ఇది ఇలావుంటే, జామియా మిలీయా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు ప్రవేశించడాన్ని మాజీ ఉపకులపతి, ఢిల్లీ మాజీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తప్పుబట్టారు. సీఏఏపై సరైన సమాచారం ప్రజలకు చేరనందునే పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు సీఏఏపై పూర్తి అవగాహన కల్పించాలని నజీబ్ జంగ్ అన్నారు.