నన్నే చెక్ చేస్తావా ? నీకెంత ధైర్యం ? లాయర్ పై ఛీఫ్ జస్టిస్ తీవ్ర ఆగ్రహం..!
దేశ అత్యున్నత న్యాయస్ధానమైన సుప్రీంకోర్టులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసులో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ తన తీర్పు ప్రకటించారు. ఛీఫ్ జస్టిస్ తీర్పు ఇచ్చారంటే దానిపై ఇక ఎవరూ సాధారణంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయరు. కానీ ఈ కేసులో వాదనలు వినిపించిన లాయర్ మాత్రం ఆ తీర్పు తనకు నమ్మశక్యంగా లేకపోవడంతో కోర్టు మాస్టర్ ను దీనిపై ప్రశ్నించారు. ఈ వ్యవహారం కాస్తా ఛీఫ్ జస్టిస్ వరకూ వెళ్లడంతో ఇవాళ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా తాను ఇచ్చిన ఓ తీర్పులో స్పష్టత కోరుతూ కోర్టు మాస్టర్ ను సదరు లాయర్ సంప్రదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఛీఫ్ జస్టిస్ ఆయన్ను ఇవాళ కోర్టుకు పిలిపించారు. నేను కోర్టులో ఏం చెప్పానో కోర్టు మాస్టర్ ని అడుగుతావా , నీకెంత ధైర్యం అని లాయర్ ను నిలదీశారు. రేపు మా ఇంటికి వచ్చి నేనేం చేస్తున్నానో నా సెక్రటరీని కూడా అడుగుతావా అని మండిపడ్డారు. లాయర్లు మతిస్దిమితం కోల్పోయినట్లున్నారు అంటూ ఛీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు.

అంతటితో ఆగని ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రస్తుతానికి తానే సీజే అని, మరికొంత కాలమే పదవిలో ఉంటానని, ఈలోపు ఇలాంటి పనులు మరోసారి చేయొద్దంటూ సదరు లాయర్ కు చురకలు అంటించారు. దీంతో అక్కడున్న వారంతా ఛీఫ్ జస్టిస్ వ్యాఖ్యలకు ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ ఏడాది నవంబర్ 10న రిటైర్ కాబోతున్నారు. ఆయన స్ధానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా సీజేఐ అయ్యే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications