CJI NV Ramana: రిటైర్మెంట్కు ఒక్కరోజు ముందు కీలక పిటీషన్లు: వీడ్కోలు సభకు ఏర్పాట్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. శుక్రవారం పదవీ విరమణ చేయబోతోన్నారు. 2014 ఫిబ్రవరి 17వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత ఏడాది ఏప్రిల్ 24వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. అయన కంటే ముందు సీజేఐగా పని చేసిన శరద్ అరవింద్ బాబ్డే నుంచి బాధ్యతలను స్వీకరించారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి 48వ చీఫ్ జస్టిస్గా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు.
కీలక పిటీషన్లు..
ఎన్వీ రమణ తరువాత చీఫ్ జస్టిస్గా ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ చేయడానికి ముందురోజు ఎన్వీ రమణ సమక్షానికి కీలకమైన పిటీషన్లు రానున్నాయి. ఇవ్వాళ వాటి మీద విచారణ చేపట్టబోతున్నారాయన. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసస్ సాఫ్ట్వేర్ కుంభకోణానికి సంబంధించిన పిటీషన్ విచారణకు రానుంది. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిందనే ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటోంది.
బిల్కిస్ బానో..
గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషుల విడుదలను చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్పైనా సీజేఐ ఎన్వీ రమణ బెంచ్ విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ కేసులో దోషులైన 11 మంది- రాధేశ్యామ్ షా, జశ్వంత్ చతుర్ భాయ్, కేశూభాయ్ వడానియా, బాకాభాయ్ వడానియా, రాజీభాయ్ సోని, రమేష్భాయ్ చౌహాన్, శైలేష్ భట్, బిపిన్ చంద్ర జోషి, గోవింద్భాయ్, మహేష్ భట్, ప్రదీప్ మోధియాకు 2008 జనవరి 21వ తేదీన సీబీఐ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. బోంబే హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది.
ప్రధాని మోదీ భద్రతపైనా..
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా లోపాలపై దాఖలైన పిటీషన్లనూ ఆయన విచారించనున్నారు. అప్పట్లో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో మోదీ కొన్ని నిమిషాల పాటు ఓ ఫ్లైఓవర్పై చిక్కుకుపోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి.
వీడ్కోలు సభ..
ఈ పరిణామాల మధ్య శుక్రవారం పదవీ విరమణ చేయబోతోన్న ఎన్వీ రమణను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించనుంది. దీనికోసం ప్రత్యేకంగా వీడ్కోలు సభను నిర్వహించబోతోంది. సాయంత్రం 4:15 నిమిషాలకు సుప్రీంకోర్టు అదనపు భవన సముదాయంలో గల మెయిన్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఏర్పాటయింది. తదుపరి సీజేఐ యూయూ లలిత్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు దీనికి హాజరు కానున్నారు.