నోట్ల కట్టల జడ్జిపై సీజేఐ కీలక నిర్ణయం-కేంద్రానికి సిఫార్సు..!
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల సభ్యుల విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ నియామకంపై కేంద్రంలో అధికార పార్టీ నేతలు, ఉపరాష్ట్రపతి సైతం విమర్శలు గుప్పించారు. చివరకు ఈ ముగ్గురు సభ్యుల కమిటీ తమ విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కు నివేదిక ఇచ్చింది.
ఈ నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్రానికి కీలక సిఫార్సు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ బంగ్లాకు అనుబంధంగా ఉన్న స్టోర్రూమ్లో భారీగా కాలిపోయిన నగదు దొరికిందనే ఆరోపణలపై విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఆయనపై వేటు వేసేందుకు చర్యలు ప్రారంభించాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. ఈ మేరకు సీజేఐ ఖన్నా.. రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖు రాశారు.

భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు అంతర్గత ప్రక్రియ ప్రకారం రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రికి ఈ వ్యవహారంపై లేఖ రాశాయని అత్యున్నత న్యాయస్ధాన వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ హైకోర్టు జడ్డి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంలో మే 3వ తేదీన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ నివేదిక సీజేఐకి అందినట్లు తెలిపారు. ఆ తర్వాత దీనిపై మే 6న సదరు జడ్జి నుంచి వివరణ తీసుకున్నాక ఆయన తొలగింపు కోసం రాష్ట్రపతి, ప్రధానికి ఇవాళ సీజే లేఖ రాసినట్లు సుప్రీంకోర్టు ప్రకటనలో తెలిపింది. అయితే ఈ కమిటీ తమ నివేదికలో ఏ సిఫార్సు చేసిందనే వివరాలు బయటికి రాలేదు.
అయితే జస్టిస్ వర్మను తొలగించడానికి మాత్రం ప్రక్రియ ప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా రాష్ట్రపతి, ప్రధానికి సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీజేఐ సిఫార్సు మేరకు కేంద్రం త్వరలో జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది.












Click it and Unblock the Notifications