సీజేపీకి మరో విక్టరీ.. సీజేపీ మద్దతుదారుడిపై అటాక్ చేసిన స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనను నిరసిస్తూ అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనల్లో షాకింగ్ ఘటన జరిగిన విషయం తెలిసిందే. అక్కడే ఆందోళనలు చేస్తున్న విద్యార్థిని నిషూ ఆజాద్ అనే కార్యకర్త తండ్రిని యాక్టివిస్ట్ స్వతంత్ర భరద్వాజ్ చితకబాదాడు. అయితే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయిన నేపథ్యంలో తాజాగా స్వతంత్ర భరద్వాజ్ ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ బులంద్ షహర్ లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. 72 గంట్లోనే నిందితుడ్ని పట్టుకుంటామని సీజేపీకి దిల్లీ పోలీసులు హామీ ఇచ్చి అదే సమయానికి గాలింపు చర్యలు చేపట్టి అరెస్ట్ చేశారు. సీజేపీ నిరసన సమయంలో సంజయ్ కుమార్ తలను పగలగొట్టినట్లు భరద్వాజ్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపింది.
" నేను సీజేపీ కార్యకర్త తండ్రిని చావగొట్టాను.. అయినా అరెస్ట్ కాలేదు.. దిల్లీలోని సీజేపీ నిరసన చేపట్టినప్పుడు సీజేపీ కార్యకర్త నిషూ ఆజాద్ తండ్రిని చితకబాదాను.. ఆయన తలకు 60 కుట్లు పడ్డాయి. మరణించే స్థితిలో అంబులెన్స్ లో పోయాడు. నేను చేసిన దాడి సగం హత్యతో సమానమని.. అందుకు IPC సెక్షన్ 307 వర్తిస్తుంది. అయినా నేను జైలుకు పోలేదు. రాత్రంతా బయటే తిరిగాను. ఇది ప్రపంచానికి తెలియాలి" అని స్వతంత్ర భరద్వాజ్ ఆ వీడియోలో కీలక వ్యాఖ్యలు చేశాడు.

కపిల్ మిశ్రా ఫోన్ చేసిన తర్వాత తాను ఒక్క రోజులోనే విడుదల అయ్యానని అన్నాడు. కపిల్ మిశ్రా, చిరాగ్ పాశ్వాన్ సహా ప్రధాని మోదీ కూడా తనకు అన్నయ్యలేనంటూ భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు, బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అటు సీజేపీ కూడా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో.. అతడ్ని పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా ఏర్పడ్డారు. 72 గంటల డెడ్ లైన్ పెట్టుకొని ఎట్టకేలకు శుక్రవారం బులంద్ షహర్ లో అతడ్ని అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications