ఆలయంలో బాహాబాహికి దిగిన అర్చకులు: పోలీసుల జోక్యం తరువాతే..!
చెన్నై: ఆలయంలో కొందరు అర్చకులు బాహాబాహికి దిగిన ఘటన ఇది. తమిళనాడు కాంచీపురంలోని ప్రఖ్యాత వరదరాజ పెరుమాళ్ స్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్వామివారికి ప్రత్యేక పూజల నిర్వహణ సందర్భంగా మంత్రోచ్ఛారణలో తప్పులు దొర్లడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
వేర్వేరు ఆచారాలను అనుసరించే అర్చకులు.. వేర్వేరుగా మంత్రోచ్ఛారణలు చేశారని, ఫలితంగా- పరస్పరం తోసుకున్నారని చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వారిని శాంతింపజేశారు.

ఏటా కార్తీకమాసం సందర్భంగా కాంచీపురంలోని విష్ణు కంచిలో గల వరదరాజ పెరుమాళ్ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తుంటారు. వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే అర్చకుల్లో తెన్ కలశై, వడ కలశై అనే వర్గాలు ఉన్నాయి. తెన్ కలశై అర్చకులు వరదరాజ పెరుమాళ్ స్వామి వారి సమక్షంలో నాళాయిరత్ దివ్య ప్రబంధ పాశురాన్ని ఆలపిస్తారు.
అదే సమయంలో- వడ కలశై అర్చకులు భూతత్ అళ్వార్ దివ్య ప్రబంధ పాశురాన్ని ఆలపించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఈ రెండు గ్రూపులకు చెందిన అర్చకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

ఈ ఏడాది మే నెలలో కూడా ఇదే తరహా వివాదం జరిగింది. అప్పట్లో ఏర్పడిన విభేదాలు మరోసారి బుధవారం నాటి ప్రత్యేక పూజల సందర్భంగా పొడచూపాయి. ప్రత్యేక పూజల సందర్భంగా వేదమంత్రాలు, పాశురాల ఉచ్ఛారణ సందర్భంగా మళ్లీ వారి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని అంటున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వరదరాజ పెరుమాళ్ స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అర్చక స్వాములను శాంతింపజేశారు. ఈ సందర్భంగా పోలీసులను సైతం పక్కకు తోసి వేస్తూ అర్చకులు గొడవ పడినట్లు చెబుతున్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కానీయబోమంటూ రెండు వర్గాల అర్చకుల ద్వారా లిఖితపూరకంగా హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications