భారత్ విషయంలో పొరపాటు చేశాం: తన తప్పు సరిదిద్దుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
జెనీవా/న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తన తప్పును సరిదిద్దుకుంది. భారతదేశంలో సమూహ వ్యాప్తి లేదని డబ్ల్యూహెచ్ఓ తాజాగా స్పష్టం చేసింది. గురువారం విడుదల చేసిన పరిస్థితి నివేదికలో వైరస్ సమూహ వ్యాప్తి దశలో ఉందని రాయడం తాము చేసిన పొరపాటేనని అంగీకరించింది.

భారత్ మూడో దశలో లేదు..
కాగా, భారతదేశంలో కరోనావైరస్ మూడో దశలో లేదని ఇంతకుముందే కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎవరి నుంచి వైరస్ సోకిందో తెలియని స్థితిలో ఉన్నప్పుడే సమూహ వ్యాప్తిగా పేర్కొనడం జరుగుతుంది. అయితే, భారత్ ఇంకా ఆ దశకు చేరుకోలేదు.

400 జిల్లాల్లో కరోనా ఊసేలేదు..
దేశంలో సమూహ వ్యాప్తి లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. తాజాగా, శుక్రవారం సాయంత్రం కేంద్ర వైద్యారోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా అదే విషయాన్ని వెల్లడించారు. దేశంలోని 400 జిల్లాల్లో వైరస్ ఉనికే లేదని చెప్పారు. కేవలం 133 జిల్లాలే కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా ఉన్నాయని వివరించారు.

కొన్ని కేసుల దశలోనే..
కరోనావైరస్ సమూహ వ్యాప్తి చేరుకుంటే ఆ విషయం దాచబోమని, ప్రజలకు వెల్లడిస్తామని ఇప్పటికే లవ్ అగర్వాల్ వెల్లడించిన విషయం తెలిసిందే. గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం సమూహ వ్యాప్తి దశలో ఉందని పేర్కొనగా.. తాజాగా క్లస్టర్ ఆఫ్ కేసేస్(కొన్ని కేసులు)గా మార్చింది.
Recommended Video

206కు చేరిన మరణాలు..
భారత్ ఆయా ప్రాంతాల్లో కొన్ని కేసులు మాత్రమే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నానికి భారతదేశంలో 6761 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 206 మంది మృతి చెందారు. కాగా, చివరి 24 గంటల్లోనే 33 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications