ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి కన్నుమూత, 5 సార్లు ఎమ్మెల్యే..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు క్రియాశీల పాత్ర పోషించిన సీనియర్ నాయకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి (85) ఇకలేరు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం (మే 29) హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవీకరించారు. వెంకటరెడ్డి కన్నుమూశారన్న వార్త తెలియగానే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల రాజకీయ నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

న్యాయవాది నుంచి మంత్రి వరకు.. గాదె ప్రస్థానం:

గాదె వెంకటరెడ్డి 1940 జూలై 10న ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో జన్మించారు. న్యాయశాస్త్రం (LLB) అభ్యసించిన ఆయన, ప్రజాసేవపై ఉన్న ఆసక్తితో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.

Andhra Pradesh Former Minister Gade Venkata Reddy Passes Away at 85 A Look at His Long Journey in AP Politics
  • తొలి విజయం: 1967 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, తన 27వ ఏటనే తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
  • ఓటములు - ఎదురుదెబ్బలు: ఆ తర్వాత రాజకీయాల్లో ఆయనకు అనేక హెచ్చుతగ్గులు ఎదురయ్యాయి. 1972, 1978, 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుస ఓటములను చవిచూశారు. అయినప్పటికీ పట్టువదలకుండా ప్రజల్లోనే ఉన్నారు.
  • తిరిగి అసెంబ్లీకి: 1991 ఉప ఎన్నికల్లో, ఆ వెంటనే 1994 సార్వత్రిక ఎన్నికల్లో పర్చూరు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
  • దేవాదాయ శాఖ మంత్రిగా: 2004, 2009 ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గానికి మారి వరుసగా విజయం సాధించారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గాలలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు.

రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ ప్రయాణం:

2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో గాదె వెంకటరెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు. దశాబ్దాల పాటు హస్తం పార్టీలోనే కొనసాగిన ఆయన, 2016 ఏప్రిల్ 29న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ (TDP)లో చేరారు. అక్కడ నాలుగేళ్ల పాటు కొనసాగిన అనంతరం, 2020 మార్చి 16న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీర్థం పుచ్చుకున్నారు. అయితే, గత కొన్నేళ్లుగా వయోభారం, అనారోగ్య కారణాల వల్ల ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. 'వైఎస్సార్‌తో ఉన్న అనుబంధం మరిచిపోలేంది'

గాదె వెంకటరెడ్డి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ సంతాపం తెలిపారు.

"దీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉంటూ, నిరంతరం ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడిగా గాదె వెంకటరెడ్డి గారు గుర్తింపు పొందారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర, వేసిన ముద్ర విలక్షణమైనది. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటు" అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో గాదె వెంకటరెడ్డికి ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారని కొనియాడారు. వెంకటరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+