ప్రతీ ఒక్కరికీ సమగ్ర సంక్షేమ కార్డు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఒకే సమగ్ర సంక్షేమ కార్డు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డు తరహాలో ఈ కార్డు రూపొందించి, దానికి ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఇవ్వాలని సూచించారు.
అన్ని పథకాల వివరాలను ఒకే కార్డులో సమగ్రంగా చేర్చాలని లక్ష్యం
ప్రస్తుతం వివిధ శాఖల ద్వారా వేర్వేరు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ముఖ్యమంత్రి సహాయ నిధి, కార్మికులు, విద్యార్థులు, మహిళలు మరియు యువతకు సంబంధించిన అన్ని పథకాల వివరాలను ఒకే కార్డులో సమగ్రంగా చేర్చాలని లక్ష్యం. ఈ కార్డు ద్వారా ప్రతి వ్యక్తి యొక్క పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒక్క చోట అందుబాటులో ఉంటుంది.

ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఏకీకృత డేటాబేస్
రేవంత్ రెడ్డి ఈ సమీక్ష సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ అధికారులతో విస్తృతంగా చర్చించారు. అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించి, ఒక ఏకీకృత డేటాబేస్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడి వ్యక్తుల ప్రొఫైలింగ్
ఈ కార్డులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడి వ్యక్తుల ప్రొఫైలింగ్ చేయాలని సీఎం ఆలోచన. దీంతో నిజమైన అర్హులకు పథకాలు సకాలంలో చేరడం, అనర్హులను గుర్తించి తొలగించడం సులభం అవుతుందని వివరించారు. ఇది సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను పెంచి, లీకేజీలను అరికట్టడానికి ఉపయోగపడుతుంది.ఇటీవల నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి సర్వే వివరాలను కూడా ఈ కార్డుతో అనుసంధానం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
అన్ని పూర్తి వివరాలతో సంక్షేమ కార్డు
కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు, ఆరోగ్య సమాచారం, మరణ ధృవీకరణలు వంటివి ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేలా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాకుండా, వలస కార్మికులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పాస్పోర్టు, వీసా సమాచారం కూడా ఈ కార్డులో చేర్చి, మధ్యవర్తుల ప్రమేయం తగ్గించాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో యువ, టెక్నాలజీ తెలిసిన అధికారులను ఈ ప్రాజెక్టుకు కేటాయించాలని చెప్పారు.
సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలుకు ప్లాన్
ఈ కొత్త వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని, పేదలకు మేలు చేస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్కు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమగ్ర సంక్షేమ కార్డు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడంతో పాటు, ప్రభుత్వ ఖజానాకు కూడా ఆదా చేస్తుందని ఆశిస్తున్నారు.













Click it and Unblock the Notifications