శభాష్ అంబికా..! : కదిలించే మాటలకు సీఎం కంటతడి (వీడియో)
అహ్మదాబాద్ : 'మగ పిల్లవాడైతే వంశాన్ని నిలబెడుతాడనే..' ఓ అసాంఘీక నమ్మకం దేశంలో ఎంతోమంది ఆడపిల్లలను గర్భంలోనే చిదిమేసేలా చేస్తోంది. ఫలితంగా ప్రతి జంట మగబిడ్డ కోసం ఆశపడి, ఆడపిల్లలను కనవద్దనే స్థాయికి దిగజారడంతో దేశంలో ఆడపిల్లల జననాల రేటు తగ్గతూ వస్తుంది.
తాజాగా గుజరాత్ లో ఇదే విషయం గురించి అందరిని ఆలోచింపజేసేలా మాట్లాడిన అంబికా అనే ఓ చిన్నారి భావోద్వేగ ప్రసంగానికి సీఎంతో సహా అందరూ చలించిపోయారు.
ఖేడా జిల్లా మహుదా పరిధిలోని హెరంజీ గ్రామానికి చెందిన అంబికా గొహెల్ అనే తొమ్మిదవ తరగతి బాలిక భ్రూణ హత్యల గురించి పాఠశాలలో భావోద్వేగ ప్రసంగం ఇచ్చింది. ఈ సందర్భంగా బాలిక మాట్లాడుతూ.. 'నేను ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే న్ను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. అమ్మా.. ఓ విషయం గుర్తించుకో.. కూతురే గనుక లేకుంటే ఏ ఇల్లు ఇల్లులా ఉండదు..' అంటూ అందరిని ఆలోచింపజేసేలా ప్రసంగించింది.
గర్భంలోనే భ్రూణ హత్యలకు గురయ్యే చిన్నారుల మనోవేదనకు అద్దం పడుతూ ఆ బాలిక ప్రసంగమంతా సాగింది. తల్లి గర్భంలో ఉండగానే లోకాన్ని చూడకుండా చిధిమేస్తున్న ప్రతి చిన్నారికి బయటి ప్రపంచంలోకి రావాలని ఉంటుందని, కానీ ఆ అవకాశాన్ని కొంతమంది తల్లిదండ్రులు ఇవ్వట్లేదని మృత శిశువు ఆవేదనను కళ్లకు కట్టింది. దీంతో కార్యక్రమానికి హాజరైన సీఎం ఆనందీ బెన్ చిన్నారి ప్రసంగం అనంతరం ఆమెను దగ్గరికి పిలుచుకుని గుండెలకు హత్తుకుంది.
కార్యక్రమానికి హాజరైన చాలామంది అంబికా ప్రసంగానికి కంటతడి పెట్టుకోవడం గమనార్హం.