సీసీయూ నుంచి జయలలిత బయటకు !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కుదటపడిందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి పొన్నియన్ చెప్పారు. త్వరలో అమ్మను క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి ప్రత్యేక గదిలోకి మారుస్తారని అన్నారు.
అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పొన్నియన్ మాట్లాడుతూ జయలలిత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి అమ్మ బయట పడటంతో శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడిందని అన్నారు.
అతి త్వరలో అమ్మను ప్రత్యేక గదిలోకి మారుస్తున్నారని పొన్నియన్ వివరించారు. గత వారం రోజులుగా జయలలితకు ఘన ఆహార పదార్థాలు ఇస్తున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం జయలలిత అందరితో మాట్లాడుతున్నారని పొన్నియన్ అన్నారు.
సీఎం జయలలితను ఎప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చెయ్యాలన్నది వైద్యులు నిర్ణయిస్తారని పొన్నియన్ చెప్పారు. ఆమె ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, మిగిలిన సమస్యలను ఆమెను ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స చేయాలా, లేక ఇంట్లో చికిత్స చేయాలా అనే విషయం వైద్యులు నిర్ణయిస్తారని పొన్నియన్ వివరించారు.
తమిళనాడు ప్రజల ప్రత్యేక పూజలు, ప్రార్థనలు ఫలించి జయలలిత త్వరగా కోలుకున్నారని పొన్నియన్ వివరించారు. అదే విధంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా జయలలిత చాల రోజుల పాటు జ్వరంతో బాదపడ్డారని ఆయన గుర్తు చేశారు.
అయితే అపోలో, ఎయిమ్స్, లండన్, సింగపూర్ వైద్యులు కలిసి వైద్యం చెయ్యడంతో జయలలిత సాధారణ స్థితికి వచ్చారని, వారందరికి పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని పొన్నియన్ చెప్పారు. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.