రంగనాథ స్వామి సేవలో కేసీఆర్.. రేపు స్టాలిన్తో భేటీ... చర్చించే అంశాలు ఇవేనా..
తమిళనాడు పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు. మార్గశిర మాసంలో ఆలయాల బాట పట్టారు. ఇటు రాజకీయ సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ గతంలో పర్యటనలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫ్రంట్ ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. మరోసారి మిత్రులను కలువడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సీఎం కేసీఆర్ మంగళవారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్తో సమావేశం కానున్నారు. తిరుత్తణిలో ఓ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు. తర్వాత ఇద్దరు సీఎంలు సమావేశం అవుతారు. స్టాలిన్ నివాసంలో సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య భేటీ జరగనుంది. ఇవాళ రాత్రి తమిళనాడులోని ఐటీసీ హోటల్లో కేసీఆర్ బస చేస్తారు.
అంతకుముందు తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రంగనాథస్వామిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. వేద మంత్రాలతో రంగనాథ స్వామి ఆలయ పండితులు సీఎం కేసీఆర్కు పూర్ణకుంభంతో ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్తోపాటు ఆయన కుటుంబ సభ్యులు గజరాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు తిరుచ్చి కలెక్టర్ శ్రీనివాసు, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్కు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు.
శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. స్వామి వారి దర్శన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. శ్రీరంగం ఆలయ దర్శనానికి రావడం ఇది రెండోసారి అని తెలిపారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రంగనాథస్వామిని దర్శించుకోవడంతో ఇదే తొలిసారి అని చెప్పారు.
Recommended Video
ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ఇదివరకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో విసృత సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్టాలిన్తో మంతనాలు సాగించనున్నారు. నీట్ పరీక్షపై స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై గుస్సా మీదున్నారు. పరీక్షను ప్రాంతీయ భాషలో రాసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఇప్పుడు స్టాలిన్తో కేసీఆర్ జరిపే మంతనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.