రైతుల రుణమాఫి, కాంగ్రెస్ నేతలతో సీఎం కుమారస్వామి చర్చలు: క్రెడిట్ ఎవ్వరికి, డేట్ ఫిక్స్!
బెంగళూరు: రైతుల రుణమాఫి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి సిద్దం అయ్యారు. జేడీఎస్ పార్టీకి చెందిన పలువురు మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులతో జరిగే చర్చల్లో పాల్గొంటున్నారు. ఇదే సందర్బంలో రైతుల రుణమాఫీ చేస్తే క్రెడిట్ ఎవ్వరికి వస్తుంది అనే విషయంపై చర్చలు జరగనున్నాయి.
Recommended Video
కాంగ్రెస్ పార్టీ సీనియర్లు
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో రైతుల రుణమాఫీ గురించి చర్చలు జరపడానికి సిద్దం అయ్యారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డీకే. శివకుమార్ తదితరులు సీఎం కుమారస్వామితో చర్చించనున్నారు.
రుణమాఫీతో సమస్యలు !
రైతుల రుణమాఫి చెయ్యాలని రోజురోజుకు కుమారస్వామి మీద ఒత్తిడి పెరిగిపోతుంది. రైతుల రుణమాఫీ తక్షణం అమలు చేస్తే కర్ణాటక ప్రభుత్వం మీద ఎలాంటి భారం పడుతుంది, ఆర్థికంగా ఏమైనా సమస్యలు ఎదురౌతాయా అనే విషయంపై కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం చర్చించనుంది.
ఢిల్లీలో చెప్పిన సీఎం
సోమవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి స్థానిక మీడియాతో మాట్లాడుతూ రైతుల రుణమాఫీ విషయంలో బుధవారం ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
బీజేపీ వార్నింగ్
కర్ణాటకలోని రైతుల రుణమాఫీ చెయ్యాలని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం మీద బీజేపీ ఒత్తిడి చేస్తోంది. వారంలోగా రైతుల రుణమాఫీ చెయ్యకపోతే తీవ్రపరిణామాలు ఎదురౌతాయని బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి కుమారస్వామిని హెచ్చరించారు.
క్రెడిట్ ఎవరికి
బుధవారం మద్యాహ్నం లోపు కర్ణాటక రైతుల రుణమాఫీ చేస్తారా, ఆలస్యం అవుతుందా, అసలు చెయ్యరా అనే విషయంలో స్పష్టమైన సమాచారం వెలుగు చూడనుంది. అయితే ఇప్పుడు రైతుల రుణమాఫీ చేస్తే క్రెడిట్ ఒత్తిడి చేస్తున్న బీజేపీకి పోతుందా, సంకీర్ణ ప్రభుత్వానికి వస్తుందా అని కుమారస్వామి నాయకులతో చర్చలు జరుపుతున్నారు.