మేజర్ పాలసీలపై నిర్ణయాలొద్దు, ఆంగ్లో-ఇండియన్ ఎమ్మెల్యేను నియమించొద్దు: యడ్యూరప్పకు సుప్రీం
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగినట్లుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. బీజేపీ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి కోరిన ఏ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు.
కర్ణాటక బీజేపీ ప్రభుత్వం బలపరీక్షకు కనీసం ఏడు రోజులైనా సమయం ఇవ్వాలని కోరారు. చివరికి వచ్చే సోమవారానికైనా గడువు ఇవ్వాలని విన్నవించారు. తమ ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారని, వచ్చే వరకు సమయం పడుతుందని చెప్పారు. అయినా, సుప్రీంకోర్టు అంగీకరించలేదు.

శనివారం సాయంత్రం 4గంటలకు ఎట్టి పరిస్థితుల్లోనూ బలపరీక్ష జరగాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అంతేగాక, సీక్రెట్ బ్యాలెట్ విధానంలో కాకుండా ఓపెన్ బ్యాలెట్ విధానంలో బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. బలపరీక్ష నిర్వహించేందుకు ప్రొటెం స్పీకర్ను కూడా వెంటనే ఎన్నుకోవాలని స్పష్టం చేసింది.
అంతేగాక, బలపరీక్ష పూర్తయ్యే వరకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్ప ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతుల రుణాలు రూ.57వేల కోట్లను రద్దు చేస్తానని యడ్యూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే.
దీనిపై శుక్రవారం నిర్ణయించాల్సి ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇది ఆగిపోయింది. ఇది ఇలా ఉంటే, ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను కూడా ముఖ్యమంత్రి యడ్యూరప్ప నియమించకూడదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications