అయోధ్య రామాలయంలో కీలక అడుగు - గర్భగుడి పనులు ప్రారంభం : 2023 చివరకు పూర్తి..!!
దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటున్న అయోధ్య రామమందిరం నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. ఆలయంలో గర్భగుడి సంబంధించిన పనులకు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు. శిలాపూజ కార్యక్రమం అనంతరం గర్భగుడి పనులు ప్రారంభమయ్యాయి. అయోధ్య హనుమాన్గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి.. రామాలయం నిర్మాణంలో భాగమైన ఇంజినీర్లను సత్కరించారు. దేశవ్యాప్తంగా మునులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2023 డిసెంబర్ కల్లా ఈ పనులు పూర్తవుతాయని కమిటీ అంచనా వేస్తోంది.
నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తోంది. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ 2019లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2020 ఆగస్టు 5న అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ముందుగానే సిద్దం చేసిన ప్రణాళికల మేరకు పనులు ముందుకు సాగుతున్నాయి. 2.7 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మందిరం పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు ఉండనుంది.
మూడు అంతస్తులతో నిర్మించనున్న ఈ మందిరం ఎత్తు 161 అడుగులు ఉంటుంది. రెండున్నర అడుగుల పొడవు ఉన్న 17 వేల రాళ్లను మందిరం నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. 2024లోగా ఆలయ నిర్మాణం, 2025లోగా ఆలయ సముదాయంలోని ఇతర నిర్మాణాలు పూర్తవుతాయని నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల కంటే ముందుగానే రామాలయం నిర్మాణం పూర్తి అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉత్తరప్రదేశ్ లో రెండో సారి వరుసగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగీ ఇప్పుడు ఈ రామాలయ నిర్మాణం పనుల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.