‘గాంధీ’ల నాయకత్వానికి ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మద్దతు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై తర్జనాభర్జనలు కొనసాగుతున్నాయి. కొందరు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాలని కోరుతుండగా.. మరికొందరు గాంధీ కుటుంబం నుంచే ఎవరో ఒకరు అధ్యక్షులుగా ఉండాలని కోరుతున్నారు. మరికొందరు మళ్లీ రాహుల్ గాంధీనే పార్టీ పగ్గాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
हर चुनौती में हमारे लिए उम्मीद की किरण माननीय सोनिया जी और आदरणीय राहुल जी हैं। हम सभी आपके साथ हैं। छत्तीसगढ़ और देश के करोड़ों कार्यकर्ता और देशवासी आपके साथ हैं।
— Bhupesh Baghel (@bhupeshbaghel) August 23, 2020
देश जिस संकटपूर्ण दौर से गुज़र रहा है उससे आपके नेतृत्व में ही छुटकारा मिलेगा। pic.twitter.com/kBjdSK5sgU
కాగా, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. గాంధీ కుటుంబ నాయకత్వానికి మద్దతుగా నిలిచారు. బీజేపీ.. దేశ రాజ్యాంగ, ప్రజాస్వామిక వ్యవస్థలను కూలదోస్తోందని ఆరోపించిన అమరీందర్ సింగ్.. ఈ సమయంలో ఇలాంటి అంశాన్ని లేవనెత్తడం తగదని అన్నారు.
బ్రిటీష్ పాలన నుంచి దేశ స్వాతంత్ర్యం సాధించడం నుంచి గాంధీ కుటుంబం దేశ పురోగతికి తీవ్రంగా శ్రమించిందని గుర్తు చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు గాంధీ కుటుంబ నేతలే సరైనవారని అన్నారు. దేశంలో బలమైన విపక్షం లేనందునే ఎన్డీయే అప్రతిహత విజయం సాధిస్తోందని, ఈ సమయంలో పార్టీ ప్రక్షాళనకు కొందరు నేతలు చేస్తున్న ప్రయత్నాలు పార్టీ, దేశ ప్రయోజనాలకు విఘాతమని అమరీందర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్ ప్రస్తుతం సరిహద్దుల వెలుపల కాకుండా అంతర్గతంగానూ పలు సవాళ్లు ఎదుర్కొంటోందని తెలిపారు. ఏకతాటిపై నిలిచిన కాంగ్రెస్ ఒక్కటే దేశాన్ని ప్రజలను కాపాడగలదని అమరీందర్ చెప్పారు. ఇది ఇలావుండగా, సోనియా గాంధీ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భఘేల్.. రాహుల్ గాంధీకి లేఖ రాశారు. పార్టీలో ఎలాంటి సవాల్ ఎదురైనా.. సోనియా, రాహుల్ చొరవ చూపి పరిష్కరించేవారన్నారు. తామంతా గాంధీ కుటుంబంతోనే ఉంటామని లేఖలో పేర్కొన్నారు. ఇక పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి కూడా సోనియా నాయకత్వానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు.
I saw the news in some newspapers that ex congressmen wanted overhaul and changes in congress party This kind of statement will create confusion in the minds of millions of congress men This a ploy by BJP to divert attention of people from facebook controversy
— V.Narayanasamy (@VNarayanasami) August 23, 2020
మరోవైపు పార్టీ నాయకత్వంలో మార్పు చేపట్టాలని కోరుతూ 23 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయడం గమనార్హం. పార్టీలో నాయకత్వ మార్పును కోరుతూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సోమవారం పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. సోమవారం జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా తన రాజీనామాపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కాగా, సోనియా గాంధీ రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను ఆ పార్టీ నేతలు ఖండించారు.