కేసీఆర్ సినీ తారల్ని మించిపోయారు!: సీఎన్ఎన్ ఐబీఎన్ వైస్ ప్రశంస
న్యూఢిల్లీ: సీఎన్ఎన్ ఐబీఎన్ ఛానల్ ఉపాధ్యక్షుడు శ్రీవాత్సవ మంగళవారం నాడు సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం ఆన్ లైన్ ఓటింగులో కేసీఆర్ అగ్రస్థానంలో నిలిచినందుకు అభినందనలు తెలిపారు.
సినీ తారలకు మించిన ప్రజాదరణను పొందారని కేసీఆర్ను ఆయన ప్రశంసించారు. అకుంఠిత దీక్షతో, అహింసా మార్గంలో తెలంగాణను సాధించడంతో పాటు వినూత్న పథకాలను చేపట్టడం ద్వారా కేసీఆర్ ప్రజాభిమానాన్ని పొందుతున్నారని చెప్పారు. ఫిబ్రవరిలో జరిగే ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కార స్వీకరణకు రావాలని కోరారు. అందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారు.
కాగా, సీఎన్ఎన్ ఐబీఎన్ నిర్వహిస్తున్న ఆన్లైన్ సర్వే ఇండియన్ ఆఫ్ ది ఇయర్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. పోటీలో ఉన్న అభ్యర్థులకు అందనంత దూరంగా కేసీఆర్ ఉన్నారు. 2006 నుంచి సీఎన్ఎన్ - ఐబీఎన్ ఈ ఆన్లైన్ పోటీ నిర్వహిస్తోంది.
పోటీలో తొలి పది మందికి ప్రస్తుతం లభించిన ఓట్లను బట్టి కేసీఆర్ ఎంతో ముందున్నారు. కేరళలో మాదక ద్రవ్యాల మాఫియా నడుం విరిచిన ఐపీఎస్ అధికారి విజయన్ తొలుత మొదటి స్థానంలో ఉండేవారు. కేసీఆర్, విజయన్ మధ్య తొలుత ఒక్క శాతం ఓట్ల తేడా కనిపించింది.
కేసీఆర్ పోటీలో రెండవ స్థానంలో ఉన్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ప్రారంభం అయింది. అనంతరం కేసీఆర్కు ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చింది. రాజకీయం, క్రీడలు, సామాజిక సేవ, వంటి వివిధ రంగాల్లో ప్రత్యేకతలు చూపిన వారిని మాత్రమే ఈ పోటీకి ఎంపిక చేశారు.
తెలంగాణ సాధన కోసం 60 ఏళ్ల నుంచి సాగిన ఉద్యమం, కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ఫలించి సాకారమైనసందర్భాన్ని పేర్కొంటూ పోటీలో కేసీఆర్ పేరు చేర్చారు. మొదటి పది మందిలో కేసీఆర్కు ఇతరులకు మధ్య ఓట్ల శాతంలో చాలా తేడా ఉంది. ఇప్పటి వరకు కేసీఆర్కు 31శాతం ఓట్లు వచ్చాయి. రెండవ స్థానంలో ఉన్న విజయన్కు 21శాతం ఓట్లు లభించాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్కు 7శాతం ఓట్లతో మూడవ స్థానంలో, సామాజిక సమస్యలపై టీవిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన అమీర్ ఖాన్ 6 శాతం ఓట్లతో నాలుగవ స్థానంలో, ఇండియన్ ఆర్మీకి 5శాతం ఓట్లు, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్యనాదెళ్లకు నాలుగు శాతం, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్షాకు నాలుగు శాతం, ఇండియన్ హాకీకి 2శాతం ఓట్లు లభించాయి.