కోల్గేట్: మాజీ ప్రధానిని ఎందుకు విచారించలేదన్న కోర్టు
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లాకు 2005లో కేటాయించిన బొగ్గు బ్లాక్ కుంభ కుంభకోణంలో మాజీ ప్రధానిని ఎందుకు విచారించలేదని అత్యున్నత విచారణ సంస్థను ఢిల్లీ ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది. కాగా, ఆ సమయంలో బొగ్గు మంత్రిత్వశాఖను ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ పర్యవేక్షించారు. అయితే అప్పటి ప్రధాని అని సంబోధించిన న్యాయమూర్తి అతని పేరును ప్రస్తావించలేదు.
‘మీకు బొగ్గుశాఖ మంత్రిని విచారించాల్సిన అవసరం లేదని అనిపించిందా? లేక ఆ మంత్రిని విచారించేందుకు అనుమతి లేదా?' అని కోర్టు సిబిఐని ప్రశ్నించింది. పారదర్శకంగా లేకుండా బొగ్గు గనుల కేటాయింపు కారణంగా ప్రభుత్వం కోట్లాది రూపాయల ధనం కోల్పోయిందనే ఆరోపణలున్నాయి.
ఆగస్టులో ఈ కుంభకోణంపై విచారించిన కోర్టు.. సుమారు 200 కోల్ బ్లాక్ కేటాయింపులను రద్దు చేసేందుకు అంగీకరించింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఆ బొగ్గు క్షేత్రాలకు వేలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
2005లో జరిగిన బొగ్గు కుంభకోణంలో విచారణ జరిపిన సిబిఐ ఇటీవల తన ఛార్జీ షీటులో కుమార మంగళం బిర్లాను, హిందాల్కోలను చేర్చడం చర్చనీయాంశమైంది. బిర్లాతో పాటు మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పిసి పరేఖ్లపై 2012లో సిబిఐ కేసు నమోదు చేసింది. కాగా, తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని హింద్కాలో తేల్చి చెప్పింది.
కాగా, హిందాల్కోకు బొగ్గు బ్లాకులను కేటాయించడం సరైనదేనని అప్పటి ప్రధాని మన్మోహన్ సమర్థించుకున్నారు. ఆ నిర్ణయం చట్టబద్ధమైనదేనని పరేఖ్ కూడా వివరించారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన సిబిఐ ఈ కేటాయింపులు నేరపూరితంగా లేవని అక్టోబర్లో కోర్టుకు తెలిపింది. ఆ తర్వాత కొన్ని వారాల క్రితం విచారణ సంస్థ ఈ కుంభకోణంలో నిందితులకు సంబంధించిన ఆధారాలున్నాయని మళ్లీ కోర్టులో పేర్కొంది.