మరో షాక్: కోల్ స్కాంలో దాసరి, జిందాల్ సహా 15 మందిపై ఛార్జీషీట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం నాడు ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ నవీన్ జిందాల్, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావు తదితరుల పైన ఛార్జీషీట్ దాఖలు చేసింది.
దాసరి నారాయణ రావు, నవీన్ జిందాల్ సహా 15 మందిపై అభియోగాలు నమోదు చేసింది. అలాగే, ఐదు కంపెనీల పైన కూడా అభియోగాలు నమోదు చేసింది. అందులో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, జిందాల్ రియాల్టీ ప్రయివేటు లిమిటెడ్ తదితర కంపెనీలు ఉన్నాయి.
మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి మధుకొడా, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, తదితరులపై నేరపూరిత కుట్ర, చీటింగ్, అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఛార్జీషీటును దాఖలు చేసింది.
కాగా, కొద్ది రోజుల క్రిత ఈడీ దాసరికి చెందిన రూ.2.25 కోట్ల ఆస్తులను జఫ్తు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దాసరి అప్పుడు స్పందించారు. సౌభాగ్య మీడియాలో తాను వాటాదారు మాత్రమేనని స్పష్టం చేశారు. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సౌభాగ్య మీడియా లిమిటెడ్ లిస్టెడ్ కంపెనీ అని, ఆ కంపెనీ వాటాల ట్రేడింగ్ జరుగుతోందని తెలిపారు.
ఈడీ ఆస్తుల జప్తునకు సంబంధించి తనకు ఎలాంటి ఉత్తర్వులూ అందలేదని, తన సొంత ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదని దాసరి స్పష్టం చేశారు. ఈడీ జప్తు ఉత్తర్వులు ఇచ్చినట్లయితే అవి తాను వాటాదారుగా ఉన్న సౌభాగ్య మీడియాకు చెందిన ఆస్తులవేనని మీడియాకు తెలిపారు.