6వేల మంది భారత టెక్కీలకు షాకిస్తున్న కాగ్నిజెంట్: కారణమిదే?
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ భారతీయ టెక్కీలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. అమెరికన్లకు తమ సంస్థలో ఉద్యోగాలను కల్పించేందుకు భారతదేశంలోని మన టెక్కీలకు తొలగించేందుకు సిద్ధమైంది.
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ భారతీయ టెక్కీలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. అమెరికన్లకు తమ సంస్థలో ఉద్యోగాలను కల్పించేందుకు భారతదేశంలోని మన టెక్కీలకు తొలగించేందుకు సిద్ధమైంది. భారతదేశంలోని ప్రముఖంగా చెన్నై సంస్థలోని పలువురు ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అక్రమ తొలగింపులేనా?
అయితే, దీనిపై పలువురు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అక్రమ తొలగింపులపై దృష్టి సారించాలని రాష్ట్ర లేబర్ కమిషన్కు కోర్టు ఆదేశాలను జారీ చేసింది. కాగా, కాగ్నిజెంట్ మొత్తంగా సంస్థ నుంచి 6వేల మంది భారత టెక్కీలను తొలగించాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే.. అమెరికాలో స్థానికులకు తమ సంస్థలో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలా ఏం లేదు..
అమెరికన్లకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించి.. హెచ్1బీ వీసాలను తగ్గించాలని భావిస్తున్నట్లు కాగ్నిజెంట్ అధ్యక్షుడు రాజీవ్ మెహతా తెలిపారు. తమ సంస్థ నుంచి అక్రమంగా ఎవరినీ తొలగించడం లేదని ఆయన స్పష్టం చేశారు. సంస్థ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం, నైపుణ్యం గల ఉద్యోగులను తీసుకోవడం చేస్తున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారమే అంతా జరుగుతోందన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే.., ఈసారి సగం మందికే వీసా దరఖాస్తు చేసినట్లు మెహతా చెప్పారు. కాగా, సంస్థలో సీనియర్ల స్వచ్ఛంద విరమణకు కూడా ప్రోత్సాహమిస్తుండటం గమనార్హం.
వరుస షాక్లు
ఇప్పటికే దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ వేలాది మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇన్ఫోసిస్ తరహాలోనే అమెరికా సంస్థ కాగ్నిజెంట్ కూడా అడుగులు వేస్తోంది. డిజిటల్ టెక్నాలజీలో అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ సంస్థ అత్యంత పెద్దది. ప్రస్తుత క్వార్టర్లో కాగ్నిజెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ భారీ స్థాయిలో లాభాలను చవిచూసింది.
అంతా ట్రంప్ వల్లే..
కాగా, కాగ్నిజెంట్ సంస్థకు ఒక్క అమెరికా నుంచే దాదాపు 75 శాతం లాభాలు వస్తున్నాయి. కాగ్నిజెంట్ కంపెనీలో సుమారు రెండున్నర లక్షల మంది భారతీయులు ఉద్యోగం చేస్తున్నారు. నైపుణ్యం ఉన్న స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కాగ్నిజెంట్ స్థానికులనే ఎంపిక చేయాలని సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐటీ దిగ్గజాలు వరుసగా తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో భారత టెక్కీలు ఆందోళన చెందుతున్నారు.