సీక్రెట్ రూమ్ సెక్స్ రాకెట్... లాడ్జిలో వ్యభిచార దందాను బట్టబయలు చేసిన పోలీసులు....
తమిళనాడులోని కోయంబత్తూరులో పోలీసులు సెక్స్ రాకెట్ను బట్టబయలు చేశారు. పక్కా సమాచారంతో ఓ లాడ్జిపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు,ఓ యువతిని అరెస్ట్ చేశారు. నిజానికి పోలీసులు మొదట లాడ్జిలోకి ప్రవేశించినప్పుడు... అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ ఓ గదిలో ఉన్న అద్దాన్ని తెరిచి చూడగా... దాని వెనుక ఓ సీక్రెట్ గది కనిపించింది. అందులో ఆ యువతిని,నిర్వాహకులను గుర్తించారు.
లాక్ డౌన్ కష్టాలతో అడ్డదారిలోకి...
వేలూరు జిల్లాకు చెందిన కె.మహేంద్రన్(46) కోయంబత్తూరులో ఊటీ రోడ్డులోని మెట్టుపాలాయంలో శరణ్య లాడ్జిని నిర్వహిస్తున్నాడు. మూడేళ్లకు దీన్ని అతను లీజుకు తీసుకున్నాడు. తమ జిల్లాకే చెందిన ఆర్.గణేశన్(36) అనే యువకుడిని లాడ్జిలో పనికి పెట్టుకున్నాడు. ఈ ఏడాది మార్చి వరకు బిజినెస్ బాగానే సాగినప్పటికీ... కరోనా లాక్ డౌన్ తర్వాత వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో నెల అద్దె రూ.50వేలు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తింది.
వ్యభిచార దందా...
ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో మహేంద్రన్,గణేశన్ ఇద్దరూ కలిసి వ్యభిచార దందాకు తెరలేపారు. బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతిని రప్పించి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీనిపై బుధవారం(అగస్టు 19) పోలీసులకు సమాచారం అందడంతో... వెంటనే రంగంలోకి దిగారు. శరణ్య లాడ్జిలోకి వెళ్లి అంతా గాలించారు. కానీ ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించలేదు.
Recommended Video
సీక్రెట్ రూమ్ సెక్స్...
'లాడ్జిలో ఉన్న అన్ని గదులను తనిఖీ చేశాం. కానీ ఎక్కడా ఎవరూ కనిపించలేదు. చివరకు,ఓ గదిలో ఎదురెదురుగా రెండు అద్దాలు ఉండటాన్ని గమనించాం. అందులో ఓ అద్దాన్ని తెరిచి చూడగా... లోపలి వైపు ఓ చిన్న సీక్రెట్ గది ఉంది. నిజానికి అదో బాత్రూమ్. కానీ పోలీసుల దాడుల నుంచి తప్పించుకునేందుకు దాన్ని ఇలా మార్చేశారు.' అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. ఆ గదిలోనే ఇద్దరు నిర్వాహకులు,ఓ యువతిని గుర్తించినట్లు తెలిపారు.నిర్వాహకులను అరెస్ట్ చేశామని,బెంగళూరుకు చెందిన ఆ యువతిని స్టేట్ హోమ్కి తరలించామని చెప్పారు. లాడ్జిలో గుర్తించిన ఆ సీక్రెట్ రూమ్... మహేంద్రన్ నిర్మించినదా... లేక అంతకుముందు లాడ్జిని లీజుకు తీసుకున్నవాళ్లు నిర్మించిందా అన్నది దర్యాప్తులో తేలుతుందన్నారు.