సహజీవనం చేస్తూ కాలేజీకి: ప్రేమజంటకు షాకిచ్చిన హైకోర్టు
కొల్లాం: తమ తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో పారిపోయి వచ్చిన ఓప్రేమ జంట కాలేజీలో చేరింది. ఒకే ఇంట్లో ఉంటూ వారిద్దరూ కళాశాలకు వెళుతుండేవారు. అయితే పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తూ కళాశాలకు వస్తున్న ఈ జంట విషయం తెలిసి కాలేజీ యాజమాన్యం వీరిని సస్పెండ్ చేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిందీ ప్రేమజంట. కాగా, కాలేజీ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
కేరళలోని కొల్లాంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కొల్లాంలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న 20ఏళ్ల యువతి.. అదే కాలేజీలో చదువుతున్న యువకుడిని ప్రేమించింది. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు.
ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే ఆ విద్యార్థులు కనిపించడంలేదంటూ వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. విషయం కళాశాల యాజమాన్యానికి తెలియడంతో వారిని సస్పెండ్ చేశారు.
తమను అన్యాయంగా కాలేజీ నుంచి సస్పెండ్ చేశారని సదరు యువతి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారించిన కేరళ హైకోర్టు.. కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టం చేసింది. ప్రేమించడం తప్పుకాదని, పెళ్లికాకుండానే సహజీవనం చేయడం వల్లే.. కళాశాల యాజమాన్యం క్రమశిక్షణ చర్యల కింద ఈ నిర్ణయం తీసుకుందని కోర్టు పేర్కొంది.
విద్యార్థుల హక్కులను తాము వ్యతిరేకించడంలేదని స్పష్టం చేసింది. కాగా, ప్రేమించినందువల్లే తమను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.ఈ ప్రేమ జంటకు మద్దతుగా కొందరు కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాగా, దీనిపై కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. క్రమశిక్షణ చర్యల కిందే వారిని తొలగించినట్లు చెప్పారు. ఓ ప్రైవేటు ఇనిస్టిట్యూట్ తమ సంస్థకు చెడ్డపేరు రావాలని ఎప్పుడూ కోరుకోదని ఆయన తెలిపారు.