వస్తువుల క్వాలిటీ సూపర్.. సౌకర్యాలు మాత్రం బేకార్..
పెరుగుతున్న నగరాల అభివ్రుద్దితో పాటు ప్రజల అభిరుచుల్లో కూడా మార్పలు చోలుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల కొనుగోలు అంశాల పట్ల మాల్స్ పై వినియోగదారులు ద్రుష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని వస్తువులు ఒకే గొడుగు క్రింద దొరకడం, అవికూడా చవకగా దొరకడాన్ని కొనుగోలు దారులు స్వాగతిస్తున్నారు. కాని వస్తువులతో పాటు వినియోగదారుల సౌకర్యాలను కూడా మెరుగు పరచాలంటున్నారు నగర వాసులు. వాహనాల పార్కింగ్ దగ్గర నుండి బిల్ కౌంటర్ వరకు గంటల తరబడి వేచిచూసే వ్యవస్థను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
పెరిగిపోయిన మాల్స్ కల్చర్.. ఉత్సాహం చూపిస్తున్న వినియోగదారులు..
పట్టణాల్లోనే కాకుండా టౌన్లలో కూడా కొనుగోలుదారుల ట్రెండ్ మారిపోతోంది. వారి అభిరుచులకు అనుకూలంగా మాల్స్ సంస్క్రుతి కూడా పెరిగిపోతోంది. ఏ వస్తువు కొనాలన్నా మాల్స్ కి వెళ్లి తెచ్చుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు తప్ప పచారి దుకాణం కి వెళ్లి తెచ్చుకునేందుకు అంత ఇష్ట పడటం లేదు నేటి యువత. వీళ్ల ఆలోచనకు తగ్గట్టు మాల్స్ లో కూడా ప్రతి వస్తువు దొరకడం.. మర్చిపోయిన వస్తువు కూడా కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపించేట్టు చేయడం మాల్స్ ప్రత్యేకతగా మారిపోయింది. అందుకే అవసరం ఉన్న వస్తువులతో పాటు కాసిని అవసరం లేని వస్తువులను కూడా ఇంటికి తెచ్చేసుకుంటారు వినియోగదారులు..మాల్స్ లో దొరికే వస్తువులు కూడా నాణ్యతతో పాటు స్వల్ప డిస్కౌంట్ ధరకు దొరుకుతుండడంతో వినియోగ దారులు ఎక్కువ సంఖ్యలో మాల్స్ ను ఎంపిక చేసుకోవడం జరుగుతోంది.
అన్ని వస్తువులు బాగుంటాయి... క్యూ లైన్లో ఎదురుచూపులు మాత్రం బాగోవు..
దైనందిన జీవతంలో వాడుకునే ప్రతి వస్తువు దొరకడం కూడా మాల్స్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అందుకే వినియోగ దారులు పెద్ద సంఖ్యలో మాల్స్ ని ఎంపికచేసుకు ని షాపింగ్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అందకే మాల్స్ లు వినియోగ దారులతో కిటకిటలాడిపోతుంటాయి. ఇలాంటి మాల్స్ లో ఇటీవల బాగా ప్రచూర్యంలోకి వచ్చి మాల్ డీ మార్ట్.. డీ మార్ట్ లో నిత్యావసర సరుకులు కొనేందుకు వినియోగ దారులు పోటీలు పడుతుండటం సర్వ సాధారణంగా మారిపోయింది. అన్ని మాల్స్ లో కన్నా డీ మార్ట్ లో దొరికే సరుకులు నాణ్యతగా ఉండటమే కాకుండా ప్రత్యేక ధరల తగ్గింపు వర్తంపు చేయడంతో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు డీమార్ట్ ను ఎంపిక చేసుకోవడం జరుగుతోంది.ఇంత వరకు కథ బాగానే ఉన్న అసలు కథ వస్తువులు కొన్న తర్వాత బిల్లు చెల్లించే కౌంటర్ దగ్గర మొదలవుతోంది. డీమార్ట్ లో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎంత ఉత్సాహం చూపుతారో సమస్యలు కూడా అంతే స్థాయిలో వెంటాడుతాయి.
బిల్ కౌంటర్లు పెంచితే సమయం వ్రుధా కాదు..
డీమార్ట్ కు వచ్చిన వినియోగ దారులు వారికి కావాల్సిన సరుకులను ఒక గంటలో సేకరించుకుంటే తర్వాత వాటికి బిల్లు చెల్లించేందుకు మాత్రం కౌంటర్ల దగ్గర రెండు గంటల పాటు నిలబడే పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. వినియోగ దారులకు సరిపడే కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడం కూడా డీమార్ట్ యాజమాన్యం వైఫల్యంగా వినియోగదారులు అభివర్ణిస్తున్నారు. ఒకటి నుండి పది వరకు బిల్ కౌంటర్లు ఏర్పాటు చేసినా అందులో రెండో మూడో పనిచేయకుండా దర్శనమిస్తాయి. తిరుమల గిరి, తార్నాక, సనత్ నగర్, కూకట్ పల్లి వై జంక్షన్, హౌసింగ్ బోర్డ్ కాలనీ ఇలా ఏ డీమార్ట్ చూసినా వినియోదారులతో కిక్కిరి పోతుంది తప్ప అందుకు తగ్గ ఏర్పాట్లను చేయకపోవడం విచారకరం. కొన్ని ప్రాంతాల్లో సరైన పార్కింగ్ సౌకర్యం కల్పించక పోవడం కూడా వినియోగదారులకు చిర్రెత్తుకొస్తుంటుంది. కేవలం పార్కింగ్ దగ్గరే 15 నుండి 20 నిమిషాల సమయం తీసుకోవడం వినియోగదారులను అసహనానికి గురిచేస్తున్న పరిణామం. తిరుమల గిరి డీమార్ట్ ఐతే ఏకంగా ప్రధాన రహదారికి ఆనుకొని ఉండటం, వాహనాలకు పార్కింగ్ స్థలాన్ని కూడా రహదారికి పక్కనే ఏర్పాటు చేయడం వినియోగదారులకు ఇబ్బంది కలిగిస్తోంది.
పార్కింగ్ సౌకర్యాలు మెరుగు పరచాలి..
ఇక మాల్ లోపల వస్తువుల కోసం ఉపయోగించే ట్రాలీలలో చిన్న పిల్లలను కూర్చోబెట్టి తమ తల్లిదండ్రులు మాలంతా తిప్పుతుండటం కూడా ఇతర వినియోగదారులకు అసౌకర్యంగా మారుతోంది. అసలు డీమార్ట్ లోకి వచ్చే చిన్న పిల్లలకు ఏజ్ రిస్ట్రిక్షన్ అమలు చేయాలనే డిమాండ్ కూడా వినియోగదారలనుండి వినిపిస్తోంది. 5 లేదా 8 సంవత్సరాల లోపు పిల్లలకు అనుమతి నిరాకరిస్తే అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా బిల్ కౌంటర్ల వద్ద గంటల తరబడి నిలబడే విధానాన్ని మార్చాలని కొనుగోలు దారులు అంటున్నారు. గంటసేపు షాపింగ్ చేస్తే రెండుగంటలు బిల్ కౌంటర్ దగ్గర వేచి చూడాల్సిన దౌర్బాగ్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. డీమార్ట్ యాజమాన్యం గాని ఇతర మాల్స్ యాజమాన్యాలు గానీ వినియోగదారుల సహనానికి పరీక్ష పెట్టొద్దని వేడుకుంటున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల దగ్గర ఇలాంటి మాల్స్ ఏర్పటు చేయడం మంచిదైనప్పటికి అందుకు తగ్గ మౌళిక సదుపాయాలు కూడా కల్పించి వినియోగ దారుల సమయాన్ని కాపాడాల్సిందిగా కోరుంకుంటున్నారు.