కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ సీఎం కిడ్నాప్ చేశారు: బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు !
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప, బీజేపీ నాయకులు కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరుకాకుండా బీజేపీ నాయకులు ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి ఎమ్మెల్యేలు శుక్రవారం జరిగిన బడ్జెట్ సమావేశాలకు హాజరుకాలేదు. ఈ సందర్బంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కిడ్నాప్ చేశారని ఆ పార్టీకి చెందిన న్యాయవాది ఆర్ఎల్ఎన్. మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన న్యాయవాది ఆర్ఎల్ఎన్ మూర్తి ప్రజాస్వామన్ని నాశనం చెయ్యడానికి ప్రజలు గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు రహస్య ప్రాంతంలో దాచిపెట్టారని, అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్పతో పాటు కొందరు బీజేపీ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని న్యాయవాది ఆర్ఎల్ఎన్, మూర్తి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని న్యాయవాది ఆర్ఎల్ఎన్, మూర్తి ఆరోపించారు.
ఆపరేషన్ కమలలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముంబైలోని హోటల్ దాచి పెట్టారని, వారిని బయటకు రాకుండా చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులతో పాటు ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. బీజేపీ నాయకులు చేపట్టిన ఆపరేషన్ కమలకు బ్రేక్ వెయ్యాలని సీఎం కుమారస్వామి ప్రయత్నాలు చేస్తున్నారు.