కాంగ్రెస్ ఎమ్మెల్యేకి రూ. 100 కోట్లు, మంత్రి పదవి, గాలి జనార్దన్ రెడ్డి మీద కేసు, చీఫ్ ట్రిక్స్
బెంగళూరు: కర్ణాటకలోని రాయచూరు గ్రామీణ శాసన సభ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బసవనగౌడ దద్దాల్ కు రూ. 100 కోట్లు, మంత్రి పదవి ఎర వేసి పార్టీ పిరాయించడానికి ఒత్తిడి చేశారని, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కేపీసీసీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు.
గాలి జనార్దన్ రెడ్డి గాలం
రాయచూరు గ్రామీణ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే బసవనగౌడ దద్దాల్ కు గాలి జనార్దన్ రెడ్డి గాలం వేశారని ఆరోపిస్తూ శుక్రవారం కేపీసీసీ నాయకుడు, సీనియర్ న్యాయవాది ఉగ్రప్ప బెంగళూరులో ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేశారు.
బీజేపీకి మెజారిటీ లేదు
కర్ణాటక శాసన సభలో బీజేపీ మెజారిటీ నిరూపించుకోవడానికి సరైన మద్దతు ఎమ్మెల్యేలు లేరని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత ఉగ్రప్ప ఆరోపించారు. రాయచూరు గ్రామీణ శాసన సభ ఎమ్మెల్యే బసవనగౌడ దద్దాల్ కు గాలి జనార్దన్ రెడ్డి ఫోన్ చేసి ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆడియో క్లిప్పింగ్ ను పోలీసులకు అందించారు.
అసెంబ్లీలో ఓటింగ్
శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప అసెంబ్లీలో బలపరీక్షలో మెజారిటీ శాసన సభ్యుల మద్దతు చూపించాల్సి ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గాలం వెయ్యాలని ప్రయత్నించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
చీఫ్ పాలిటిక్స్
కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం దక్కదనే ఆందోళనలో గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారని, భారీ మొత్తంలో నగదు, మంత్రి పదవి ఇస్తామని ఓ ఎమ్మెల్యేతో మాట్లాడరని నకిలీ ఆడియో క్లిప్పింగ్ విడుదల చేసి చీఫ్ పాలిటిక్స్ ప్లే చేస్తోందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ విరుచుకుపడ్డారు.
ఆ గొంతు ఎవరిది !
కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆడియో క్లిప్పింగ్ లో ఉన్న ఇద్దరి మాటలు ఎవరివి అని ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చెయ్యడంతో ఆడియో క్లిప్పింగ్ లోని వాయిస్ ఎవరివి అని గుర్తించడానికి పోలీసులు నిపుణులను సంప్రదిస్తున్నారు.