కాంగ్రెస్ కు 10, డీఎంకే 20 .. తమిళనాడులో పొడిసిన పొత్తు
చెన్నై : పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల తేదీ సమయం సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు పొత్తుల ఎత్తుల్లో మునిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య తేడా లేనప్పటికీ .. యూపీఏ భాగస్వామ్య పక్షాలు మాత్రం దుందుకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఎన్డీఏ కన్నా ముందే సీట్ల కేటాయింపుపై తమ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపి ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకెళ్తోంది.

తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే బరిలోకి ..
తమిళనాట ఎప్పటిలాగే డీఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళుతోంది. దీనికి సంబంధించి ఇరుపార్టీల నుంచి చర్చలు కూడా జరిపారు. రాష్ట్రంలో 10 లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ కు కేటాయించారు. మిగతా 20 చోట్ల డీఎంకే పోటీ చేస్తోంది. ఈ మేరకు మంగళవారం డీఎంకే చీఫ్ స్టాలన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏ ఏ నియోజకవర్గంలో .. ఏ అభ్యర్థి పోటీ చేస్తారో ఈ నెల 7న ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 39 లోక్ సభ స్థానాలు ఉండగా .. 30 సీట్లకు పోటీ చేస్తామని స్టాలిన్ ప్రకటించారు. మరి 9 చోట్ల ఎవరు పోటీ చేస్తారనే అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

9 సీట్లు డీఎండీకేకు ఇస్తారా ?
మిగిలిన 9 సీట్లు డీఎండీకేకు ఇస్తారా అనే సందేహం కలుగుతోంది. అన్నాడీఎంకే భాగస్వామ్య పక్షంమైన డీఎండీకే .. ఈ మధ్య ఆ పార్టీతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. దీనికి కారణం రాజ్యసభ సీటు ఇవ్వమని కోరితే అన్నాడీఎంకే నిరాకరించడమే. దీంతో కినుక వహించిన ఆ పార్టీ చీఫ్ విజయ్ కాంత్ మంగళవారం చెన్నైలో ఆఫీస్ బేరర్లలో సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో వ్యక్తమయ్యే అభిప్రాయాలతో అన్నాడీఎంకే గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల స్టాలిన్ తో విజయ్ కాంత్ సమావేశం అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో సీట్లపై చర్చించారని సమాచారం. మంగళవారం నాటి సమావేశంలో .. నిర్ణయం తీసుకొని, డీఎంకేతో కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications