అశోక్ గెహ్లాట్ కు ప్లాన్ అట్టర్ ఫ్లాప్ ! రాజస్థాన్ పోరుపై హైకమాండ్ ఫైర్-కాంగ్రెస్ అధ్యక్ష పోటీ కష్టమేనా ?
ఓవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడే అవకాశం వచ్చింది. మరోవైపు తాజాగా ఉదయ్ పూర్ లో పార్టీ ఆమోదించిన తీర్మానం మేరకు రాజస్తాన్ లో ప్రస్తుతం ఉన్న సీఎం పదవి వదులుకోక తప్పడం లేదు. దీంతో తన అనుయాయుడైన సీపీ జోషిని పదవిలో కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయిస్తున్న అశోక్ గెహ్లాట్ కు షాకులు తప్పడం లేదు. రాజస్తాన్ లో సజావుగా అధికార మార్పిడి చేసేందుకు అధిష్టానం దూతల్ని పంపిస్తే ఎమ్మెల్యేలు వారిని కలవకుండా రాజీనామాల పేరుతో బెదిరింపులకు దిగడం హైకమాండ్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా రాజస్తాన్ లో సీఎంగా కూడా కొనసాగుతానంటూ చివరి వరకూ పట్టుబట్టిన గెహ్లాట్.. అది కుదరకపోయేసరికి స్పీకర్ సీపీ జోషికి సీఎం పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. తన ప్రత్యర్ధి సచిన్ పైలట్ కు అవకాశం దక్కకుండా చేసేందుకు వేసిన ఎత్తుగడ ఇది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ దూతలుగా వచ్చిన అజయ్ మాకెన్, మల్లిఖార్జున్ ఖర్గేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలవకుండా చేసి రాజీనామాలంటూ బెదిరింపులకు దిగడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అశోక్ గెహ్లాట్ కు అసలుకే ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అవకాశం దక్కడమే కాకుండా ఆయన్ను అధ్యక్షుడిని చేసేందుకు హైకమాండ్ పెద్దలైన సోనియా, రాహుల్ వంటి వారు మద్దతు కూడా ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో రాజస్తాన్ లో అధికారం తన చేయి దాటిపోకుండా గెహ్లాట్ వేస్తున్న ఎత్తులతో వారు కూడా తమ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. దీంతో పరిస్దితి గమనించిన గెహ్లట్ ఏకంగా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కంటే రాజస్తాన్ లో సీఎం పదవి నిలబెట్టుకుంటే చాలని గెహ్లాట్ భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గెహ్లాట్ నామినేషన్ వేయకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.