కాంగ్రెస్ బండారాన్ని బయటపెట్టండి -విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లండి -బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ
కరోనా మహమ్మారి నిర్వహణలో కేంద్రం వైఫల్యం, పెట్రోల్, నిత్యావసరాల అధిక ధరలకు తోడు కొత్తగా వెలుగులోకి వచ్చిన పెగాసస్ నిఘా కుట్ర వ్యవహారాలపై పార్లమెంట్ లో దుమారం కొనసాగుతున్నది. వర్షాకాల సమావేశాలు మొదలై పది రోజులు కావొస్తున్నా ఇప్పటి దాకా ఫలవంతమైన చర్చలేవీ సభలో సాగలేదు. ప్రతిరోజూ ఏదో ఒక అంశంతో విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకొంటుడటంపై ప్రధాని నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో ఈ మేరకు ఆయన బీజేపీ ఎంపీలకు కీలక నిర్దేశం చేశారు..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయని, ఆ పార్టీల నేతల నిజ స్వరూపాలను బయటపెట్టాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారు. సభ సజావుగా జరక్కుండా అడ్డుకుంటున్న విపక్షాల తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్కు సంబంధించిన ఏ సమావేశంలోనూ విపక్షాలు పాల్గొనకపోవడం, ఉభయసభల కార్యక్రమాలను జరక్కుండా అడ్డుకోవడం వంటి చర్యలను ప్రజల దృష్టికి తేవాలని ఎంపీలకు సూచించారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, విపక్షాలు చర్చకు సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీ తీసుకు వెళ్లాలన్నారు.

దేశవ్యాప్తంగా కోవిడ్ పరిస్థితిపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిస్తే, కాంగ్రెస్ పార్టీ ఆ సమావేశాన్ని బహిష్కరించడమే కాకుండా ఇతర పార్టీలనూ భేటీకి రానీయలేదని మోదీ మండిపడ్డారు. కొత్త మంత్రులను సభకు పరిచయం చేస్తున్న సమయంలో కూడా విపక్షాలు నినాదాలు చేస్తూ అమర్యాదగా వ్యవవహరించాయని, కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల అనుచిత ప్రవర్తనను మీడియాతో పాటు జనం ముందు బయటపెట్టాలని ప్రధాని అన్నారు. కాగా,

75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎంపీలంతా తమ తమ నియోజకవర్గాల్లో, ప్రతి గ్రామగ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించారు. 75 స్వాంతంత్ర్య వార్షికోత్సవాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజాఉద్యమంగా, ప్రజా భాగస్వామ్యంతో నిర్వహించాలని ఆయన సూచించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications