కాంగ్రెస్కు మరో షాక్: మహాకూటమికి దూరమేనన్న సీపీఎం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ ఆశలపై తాజాగా సీపీఎం కూడా నీళ్లు చల్లింది.
కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తూ ఉండదని సీపీఎం తేల్చి చెప్పింది. ఢిల్లీలో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం నేతలు తెలిపారు.
మహాకూటమికి భారీ షాక్: తేల్చేసిన మాయావతి, డిగ్గీ, కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు
ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్ వేదికగా జరిగిన సీపీఎం జాతీయ మహా సభల్లో కాంగ్రెస్ పార్టీతో ముందస్తు పొత్తులు పెట్టుకోరాదన్న నిర్ణయానికే కేంద్ర కమిటీ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. అయితే, ఎన్నికల అనంతరం పొత్తులపై అప్పటి పరిస్థితుల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని సీపీఎం భావిస్తోంది.
2004లో యూపీఏ-1 ప్రభుత్వానికి సీపీఎం బయటనుంచి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే తరహాలో కాంగ్రెస్ పార్టీతో ముందస్తు పొత్తు కాకుండా ఎన్నికల తర్వాత ఏర్పడే రాజకీయ మార్పులను బట్టి ముందుకు వెళ్లాలని సీపీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మహాకూటమికి దూరంగా ఉంటున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ప్రకటించిన విషయం తెలిసిందే.