కర్ణాటక మంత్రివర్గం: కాంగ్రెస్కు 22, జేడీఎస్కు 12, పరమేశ్వరకు డిప్యూటీ సీఎం
బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బుధవారం కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది.
జేడీఎస్ అధినేత కుమారస్వామి బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనుండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. విధాన సౌధలో తూర్పు ద్వారం మెట్లపై ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది.
ఈ వేడుకకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై ఇరు పార్టీల నేతలు బెంగళూరులో మంగళవారం సమావేశమై చర్చించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఎప్పుడు నిర్వహించాలనే దానిపైనా నిర్ణయం తీసుకున్నారు. అలాగే, రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రివర్గంలో మొత్తం 34 మంత్రి పదవుల్లో డిప్యూటీ సీఎంతో కలిపి కాంగ్రెస్కు 22.. సీఎం పదవితో కలిపి జేడీఎస్కు 12 కేబినెట్ బెర్త్లు కేటాయించనున్నట్టు ఈ భేటీ అనంతరం కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
మే 25న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్కు చెందిన కేఆర్ రమేశ్ కుమార్ను స్పీకర్ పదవికి ఎంపిక చేసినట్టు వివరించారు. డిప్యూటీ స్పీకర్ పదవి జేడీఎస్కు వెళ్తుందన్నారు. ఇతర మంత్రి పదవులు, శాఖలను బల నిరూపణ తర్వాత చేపడతామని వెల్లడించారు.
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపించడం తనకొక అతిపెద్ద సవాల్ అని సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న జేడీఎస్ నేత కుమారస్వామి తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన శృంగేరీ శారదా ఆలయాన్ని, దక్షిణమన్య పీఠాన్ని సందర్శించారు.
కాగా, 'మంత్రివర్గ ఏర్పాటు, విస్తరణపై ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. మే 25న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించాలని తీర్మానించాం. ఎల్లుండి మంత్రులకు శాఖలు కేటాయింపుపై చర్చిస్తాం. సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించాం' అని కుమారస్వామి మీడియాకు తెలిపారు. కాగా, మే 24న కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం బలం నిరూపించుకోనుంది.