కాంగ్రెస్ ఓ లాఫింగ్ క్లబ్.. ఆ మాట చిన్న పిల్లలు కూడా నమ్మరు: మోడీ
ఎన్నికలు సమీపిస్తుండటంతో హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ తమ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ప్రధాని మోడీ గురువారం కంగ్రాలో జరిగిన పార్టీ ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్ట
సిమ్లా: ఎన్నికలు సమీపిస్తుండటంతో హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ తమ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ప్రధాని మోడీ గురువారం కంగ్రాలో జరిగిన పార్టీ ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఓ లాఫింగ్ క్లబ్ అని మోడీ ఎద్దేవా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పెట్టుకుందని, కానీ ఆ పార్టీ సీఎం అభ్యర్థి వీరభద్ర సింగ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుదామన్న కాంగ్రెస్ మాటలను చిన్న పిల్లలు కూడా నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ లాఫింగ్ క్లబ్ మాదిరి తయారైందన్నారు.
ఇక డోక్లాం వివాదం గురించి ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి దేశ సైన్యంపై నమ్మకం ఉండదు కానీ చైనా రాయబారిని కలుసుకుని ఆరా తీస్తారని మండిపడ్డారు. పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ స్వాతంత్ర్యం గురించి ఓ కాంగ్రెస్ నేత మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా చిదంబరంను టార్గెట్ చేశారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం ఐదు భూతాలు పట్టి పీడుస్తున్నాయని మోడీ అన్నారు. మైనింగ్, అటవీ, డ్రగ్స్, బదిలి మాఫీయాలు రాష్ట్రంలో పాతుకుపోయాయని అన్నారు. వాటిని పెకిలించివేయాల్సిన అవసరం వచ్చిందని గుర్తుచేశారు. అమరవీరుల త్యాగాన్ని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కు ఉందా? అని ప్రశ్నించారు.