కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తగా సునీల్ కానుగోలు: ప్రశాంత్ కిశోర్కు బదులుగా: టీడీపీ నుంచి
న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తోన్నాయి. ఈ ఏడాది చివర్లో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వెలువడితే- నరేంద్ర మోడీ జమిలి ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం ఉంది. ఆ ఉద్దేశంతోనే పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి తగ్గించిందనే అభిప్రాయాలు సైతం లేకపోలేదు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సైతం ఇదివరకే స్పష్టం చేశారు.

ఎన్నికల సన్నాహాల్లో కాంగ్రెస్..
ఈ పరిణామాల మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ- ఎన్నికల సన్నాహాలను మొదలు పెట్టింది. సాధారణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కూడా. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలు కావడం, ఆ తరువాత ఎదుర్కొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలను అందుకోలేకపోవడం వంటి పరిస్థితుల్లో వచ్చే లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

టాస్క్ఫోర్స్ 2024..
భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిని ఓడించాలనే లక్ష్యంతో పావులు కదపడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా- ప్రత్యేకంగా ఓ టాస్క్ఫోర్స్ 2024ను ఏర్పాటు చేసింది. కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు పీ చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ వాద్రా, రణ్దీప్ సింగ్ సుర్జేవాలాలను ఈ టాస్క్ఫోర్స్లో సభ్యులుగా చేర్చింది. వారందరితో పాటు రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలును కూడా ఈ టాస్క్ఫోర్స్లోకి సభ్యుడిగా చేర్చింది.

సునీల్ కానుగోలుకు సభ్యత్వం..
హేమాహేమీల్లాంటి నాయకులతో పాటు సునీల్ కానుగోలును ఈ టాస్క్ఫోర్స్లో సభ్యుడిగా చేర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సునీల్ కానుగోలు ఇదివరకు తెలంగాణ రాష్ట్ర సమితికి రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ఆ తరువాత ఆ పార్టీకి దూరం అయ్యారు. టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్- పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ను నియమించుకోవడంతో సునీల్ కానుగోలు బయటికి రావాల్సి వచ్చింది. అనంతరం ఆయన కొద్దిరోజులు తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయ్యారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ క్యాంప్లో చేరినట్లు వార్తలొచ్చాయి.

భారత్ జోడో యాత్ర విజయవంతానికి..
ఇప్పుడు తాజాగా ఏకంగా కాంగ్రెస్ అధిష్ఠానమే ఆయనను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది. టాస్క్ఫోర్స్ 2024లో సభ్యుడిని చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవలే రాజస్థాన్లో నిర్వహించిన చింతన్ శివిర్లో ఆమోదించిన నవ్ సంకల్ప్ డిక్లరేషన్కు అనుగుణంగా ఈ టాస్క్ఫోర్స్ ఏర్పాటైంది. దీనితో పాటు- భారత్ జోడో యాత్ర సెంట్రల్ ప్లానింగ్ కమిటీని కాంగ్రెస్ అధిష్ఠానం ఏర్పాటు చేసింది. ఈ భారత్ జోడో యాత్ర- జాతిపిత మహాత్మాగాంధీ జయంతి రోజు అక్టోబర్ 2వ తేదీన ఆరంభమౌతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఈ యాత్ర కొనసాగుతుంది.

మరిన్ని కమిటీలు..
ఈ కమిటీలో దిగ్విజయ్ సింగ్, సచిన్ పైలెట్, శశిథరూర్, రవ్నీత్ సింగ్ భిట్టు, కేజే జార్జ్, జోతి మణి, ప్రద్యుత్ బొర్డొలాయ్, జీతూ పట్వారి, సలీమ్ అహ్మద్లను నియమించింది. జాతీయ స్థాయిలో రాజకీయ వ్యవహారాల కమిటీని సైతం తెర మీదికి తీసుకొచ్చింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఈ కమిటీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాందీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గె, గులాంనబీ ఆజాద్, అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ, కేసీ వేణుగోపాల్, జితేంద్ర సింగ్ ఇందులో సభ్యులు.












Click it and Unblock the Notifications