కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలు వాయిదా: మోడీ-యోగీ సభలపైనా చర్యలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటోంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 58,097 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఒకేసారి 60 వేలకు చేరువ కావడం కలకలం రేపుతోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలను దాటేసింది. ఫలితంగా- పలు రాష్ట్రాలు ఆంక్షల్లోకి వెళ్లాయి. వీకెండ్, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తోన్నాయి.

రెండువేలకు పైగా..
ఈ పరిణామాల మధ్య ఒమిక్రాన్ వేరియంట్ మరింత విస్తృతమౌతోంది.. భయానకంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలను దాటేశాయి. మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 2,135కు చేరుకున్నాయి. ఇది అక్కడితో ఏ మాత్రం ఆగేలా కనిపించట్లేదు. రెండు రోజుల కిందట 1,700 వరకు నమోదైన ఈ కేసులు ఈ 48 గంటల్లోనే రెండు వేలను దాటేశాయంటే- ఈ వేరియంట్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతోందనేది అర్థం చేసుకోవచ్చు.

కాంగ్రెస్ కీలక నిర్ణయం..
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలు, ప్రదర్శనలను వాయిదా వేసుకుంది. నియోజకవర్గ స్థాయిల్లో పరిమితంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించింది. ఉత్తర ప్రదేశ్ సహా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ ఇవి వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు లేఖలు రాసింది.

పరిస్థితులకు అనుగుణంగా..
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్లల్లో ఒకట్రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దీనికోసం అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోన్నాయి. ఇప్పుడు తాజాగా కోవిడ్ రోజువారీ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో- కాంగ్రెస్ తన ప్రచార కార్యక్రమాలను వాయిదా వేసుకుంది. పరిస్థితులకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పరిమితంగా నిర్వహించుకోవచ్చని తెలిపింది.

ఈసీకి లేఖ..
దేశంలో కరోనా వైరస్ రోజువారీ కేసులను దృష్టిలో ఉంచుకుని.. తక్షణమే స్పందించాలని, పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రకు లేఖ రాసింది. కరోనా వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విస్తృతంగా పర్యటిస్తున్నారని, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారని, వాటిని అడ్డుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.
Recommended Video

ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచార సభలుగా..
ఎన్నికల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ-ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తోన్నారని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వ కార్యక్రమాలను అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలుగా మార్చేశారని మండిపడింది. ఇప్పటికే పలుమార్లు మోడీ.. ఉత్తర ప్రదేశ్లో పర్యటించారని, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే అభివృద్ధి పథకాలు గుర్తుకొచ్చాయా? అని ప్రశ్నించింది. వాటిని నిషేధించాలని కోరుతూ ఈసీకి లేఖ రాసింది.












Click it and Unblock the Notifications