కర్ణాటకలో చక్రం తిప్పిన ప్రియాంక గాంధీ.. ఆ వ్యూహం ఆమెదేనట.. దేవేగౌడ అందుకే ఫిదా!
Recommended Video
కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. గవర్నర్ కోర్టులో బంతి ఉండటంతో తదుపరి ప్రభుత్వాన్ని ఎవరూ చేపట్టనున్నారో తెలియనుంది. ఇదిలా ఉంటే కన్నడనాట ఏ పార్టీకి మెజారిటీ లభించని నేపథ్యంలో జేడీ(ఎస్)కు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశమైంది. కర్ణాటక రాజకీయాలను కుదిపేసే నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకోవడం వెనుక సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ చతురతతో కూడిన నిర్ణయమేనట.. హంగ్ ఏర్పడిన సభలో ఎవరూ ప్రభుత్వాన్ని చేపడుతారంటూ ఓ పక్క విశ్లేషణ జరుగుతుంటే ప్రియాంక సంచలన నిర్ణయం రాజకీయ పండితులను ఆలోచనలో పడేసింది.. ఇంతకీ ఈ వ్యవహారంలో ఏమి జరిగిందంటే..
పావులు కదిపిన ప్రియాంక గాంధీ
కర్ణాటకలో ముందు నుంచి జేడీఎస్తో పొత్తుకు కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ అయిష్టతను ప్రదర్శిస్తూ వచ్చారు. కానీ ఎన్నికల ఫలితాలు తర్వాత సంక్షోభం నెలకొనడంతో ప్రియాంక గాంధీ చకచకా పావులు కదిపారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో రాష్ట్రంలో కీలక పాత్ర వహించడానికి జేడీఎస్కు మద్దతు తెలపాలని, కుమారస్వామికి సీఎం పదవిని ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారంట.
గోవా, మణిపూర్ రిపీట్ కాకుండా
గోవా, మణిపూర్లో జరిగిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొన్న కాంగ్రెస్ కర్ణాటకలో ముందస్తు జాగ్రత్తలు తీసుకొన్నది. ఓ పక్క ఫలితాలు వెలువడుతుంటడగానే పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ను రంగంలోకి దించింది.
ప్రియాంక గాంధీ సూచనతో రాహుల్
ప్రియాంక గాంధీ సలహా రాహుల్ను కూడా కన్విన్స్ చేయడంతో వెంటనే కాంగ్రెస్ అధిష్టానం చకచకా పావులు కదిపింది. వెంటనే దేవేగౌడ, కుమారస్వామితో చర్చలు జరుపాలని సోనియా ఆదేశించింది. ఈ మేరకు ఆజాద్ బృందం జరిపిన చర్చలు సఫలం కావడంతో బీజేపీని అధికారానికి దూరంగా పెట్టే ప్రయత్నం సక్సెస్ అయింది.
తలవొగ్గిన సిద్ధరామయ్య
కాంగ్రెస్ పార్టీ 100 సీట్ల మార్కును చేరుకోలేని పరిస్థితిలో ప్రియాంక గాంధీ సూచనను సీఎం అభ్యర్థి సిద్ధరామయ్య గత్యంతరం లేక అంగీకరించాల్సి వచ్చింది. ఒకవేళ 100 సీట్ల మార్కును దాటగలితే కాంగ్రెస్ డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండేదనేది రాజకీయ వర్గాల వాదన.
దేవేగౌడ స్వప్నం నెరవేరిందిలా
తన కుమారుడు కుమారస్వామిని సీఎంగా చూడటమే దేవేగౌడ ఏకైక స్వప్నం. సీట్లు గెలువకుండానే అదృష్టం కలిసి వచ్చి సీఎం పదవి కళ్ల ముందు కదలాడటంతో దేవేగౌడ మరుక్షణం ఆలోచించలేదు. భేషరతు మద్దతుకు దేవేగౌడ ప్రభుత్వ ఏర్పాటుకు సుముఖత చూపించారు. ఆ తర్వాత గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మాకు మెజారిటీ ఉందని కుమారస్వామి తన వాదన వినిపించారు.
కలిసి వచ్చిన ప్రియాంక వ్యూహం
ఇలా కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ రాజకీయ చతురత ప్రదర్శించడం వెనుక ప్రియాంక వ్యూహం పెద్ద ప్రభావాన్నే చూపింది. గతంలో మణిపూర్, గోవా అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించినా గానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడం కాంగ్రెస్ వ్యూహాల్లో అనేక లోపాలు కనిపించాయి. ప్రస్తుతం ప్రియాంక చతురత కాంగ్రెస్కు కలిసి వచ్చేలా కనిపిస్తున్నది.