కర్ణాటక విధాన పరిషత్ చైర్మన్ పదవి, జేడీఎస్, కాంగ్రెస్ దెబ్బకు బీజేపీ సీటు గల్లుంతు ? పొత్తు !
బెంగళూరు: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల స్నేహం విధాన పరిషత్ ఎన్నికల్లో కొనసాగే అవకాశం ఉంది. శాసన సభ స్పీకర్ పదవి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడంతో ఇప్పుడు విధాన పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలని జేడీఎస్ అడుగుతోంది. బీజేపీ అధీనంలో ఉన్న విధాన పరిషత్ చైర్మన్ సీటు ఇప్పుడు చెయ్యిజారే అవకాశం ఉంది.
బీజేపీ లీడర్ శంకరమూర్తి
కర్ణాటక విధాన పరిషత్ చైర్మన్ డిహెచ్. శంకరమూర్తి పదవి కాలం జూన్ 21వ తేదీతో ముగుస్తుంది. డిహెచ్ శంకరమూర్తి స్థానంలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు ఎన్నుకున్న సీనియర్ నాయకుడిని చైర్మన్ గా నియమించాలని చర్చలు జరుగుతున్నాయి.
స్పీకర్ మీకు చైర్మన్ మాకు
విధాన పరిషత్ లో జేడీఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఉన్నారని, శాసన సభలో స్పీకర్ స్థానం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చామని, విధాన పరిషత్ చైర్మన్ స్థానం జేడీఎస్ కు ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. విధాన పరిషత్ చైర్మన్ స్థానం మాకే ఇవ్వాలని ఇప్పటికే కాంగ్రెస్ కు చెప్పామని జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అంటున్నారు.
దేవేగౌడ ఎంట్రీ
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మంత్రి వర్గం ఏర్పాట్లు పూర్తి అయిన తరువాత మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ విధాన పరిషత్ చైర్మన్ విషయంపై చర్చలు జరుపుతారని జేడీఎస్ సీనియర్ ఎమ్మెల్సీ అన్నారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ కుమార్ స్పీకర్ గా వ్యవహరించనున్నారు.
బీజేపీకి ఎదురు దెబ్బ !
కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు ఒక్కటై విధాన పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇంత కాలం విధాన పరిషత్ చైర్మన్ స్థానంలో బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు డిహెచ్. శంకరమూర్తి ఉన్నారు. విధాన పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ ఎలా ముందుకు వెలుతుందో వేచిచూడాలి.