చిరుపై ఆశ: బాబు దోస్త్పై ఏపీనుండే రాహుల్ పోరు! టి కంటే ఏపీ పైనే
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పైన పోరు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు! ఏపీలో తెలుగుదేశం - బీజేపీ మిత్రపక్షం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. చాలాచోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, రాయపాటి సాంబశివరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి సీనియర్ నేతలు బీజేపీ, టీడీపీలలో చేరారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తిరిగి ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేసే అంశంపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణకు రాహుల్ గాంధీ నుండి పిలుపు వచ్చింది. ఏపీలో పార్టీ బలోపేతం పైన చర్చించారు.
ఏపీలో పార్టీ ఇప్పుడే బలపడుతోందని, మరింత కష్టపడాలని బొత్స చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పర్యటించాలని బొత్స పార్టీ ఉపాధ్యక్షుడిని కోరారు. దీనికి రాహుల్ స్పందిస్తూ.. త్వరలో కేంద్రానికి వ్యతిరేకంగా చేపట్టనున్న ఆందోళనను ఆంధ్రప్రదేశ్ నుండే ప్రారంభిస్తామని చెప్పారు. ఏపీ నుండి ప్రారంభించే ఆ ఆందోళనలో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశాలున్నాయి.
చిరంజీవి పైనే ఆశలు!
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ కేంద్రమంత్రి చిరంజీవి పైననే ఎక్కువ ఆశలు పెట్టుకున్నదని అంటున్నారు. మంచి ఇమేజ్ ఉన్న చిరంజీవి ద్వారానే పార్టీ తిరిగి పుంజుకోగలదని భావిస్తున్నారని అంటున్నారు. టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ కంటే ఏపీ పైనే ఎక్కువ దృష్టి?
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో సెంటిమెంటు కారణంగానే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, కానీ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనే గౌరవం ప్రజల్లో ఉందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అంత కష్టమేమీ కాదని భావిస్తున్నారని సమాచారం. అంతేకాకుండా, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీయే. మరోవైపు, ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి భవిష్యత్తులో అవసరమైతే యూపీఏ కూటమికి మద్దతిచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.
అదే, ఏపీలో తమకు బద్దశత్రువైన టీడీపీ అధికారంలో ఉంది. అంతేకాకుండా, కేంద్రంలో ప్రత్యర్థి అయిన బీజేపీతో జతకట్టింది. అంతేకాకుండా, సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానప్పటికీ తన ప్రాధాన్యతను కోల్పోలేదు. కానీ ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ కారణాల వల్ల అధిష్టానం ఏపీ పైనే ఎక్కువ దృష్టి సారిస్తోందని అంటున్నారు.