అనూహ్యం: గోదీ మీడియాకు కాంగ్రెస్ కౌంటర్ -సొంతగా ‘INC TV’ ప్రారంభం -జర్నలిస్టుల తీరుపై తొలి షో
గడిచిన ఏడేళ్లుగా దేశంలోని ప్రధాన స్రవంతి మీడియా కాస్తా మోదీ ఒడిలో ఆటబొమ్మగా, గోదీ మీడియాగా మారిపోయిందని, గొంతు వినిపించే అవకాశం ఇవ్వకపోగా, ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గోదీ మీడియాకు కౌంటర్ గా, తమ సందేశాన్ని నేరుగా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ 'INC TV' పేరుతో సొంతగా మీడియా ప్లాట్ఫామ్ను ప్రారంభించింది.
Recommended Video
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జాతీయ కాంగ్రెస్ పార్టీ సొంతగా పార్టీ పేరు కలిసొచ్చేలా 'ఐఎన్సీ టీవీ'పేరుతో యూట్యూబ్ టీవీ ఛానల్ ను ప్రారంభించింది. ఏఐసీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు నీరజ్ కుందన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ లు 'ఐఎన్సీ టీవీ' యూట్యూబ్ ఛానల్ను లాంచ్ చేశారు.

ప్రస్తుత జర్నలిస్టుల తీరును పరోక్షంగా ఎత్తి చూపుతూ, 'ఐఎన్సీ టీవీ'లో తొలి షోగా భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా మహాత్మా గాంధీ పాత్రపై ఒక లఘు చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రసారం చేసింది. ఈ నెల 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 'ఐఎన్సీ టీవీ' లైవ్ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో ప్రసారం చేస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు.
'ఐఎన్సీ టీవీ'లో ప్రతి రోజు సుమారు 8 గంటలపాటు ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు ఉంటాయని సుర్జేవాలా చెప్పారు. చాలా ఏళ్లుగా ప్రధాన స్రవంతి మీడియా పక్షపాతంతో, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన కాంగ్రెస్.. తమ సందేశాన్ని ప్రజలకు నేరుగా తెలియజేయడానికి సొంతంగా పార్టీ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించినట్లు పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి దాకా 'Indian National Congress' పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉండగా, దానికి 14.8లక్షల సబ్స్క్రైబర్లున్నారు. కొత్త చానల్ INC TV ఇవాళ లాంఛ్ అయినప్పటికి, ప్రసారాలు 24వ తేదీ నుంచి అందుబాటులోకి కానున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీ యూట్యూబ్ ఛానల్కు 3.67 కోట్ల సబ్స్క్రైబర్లున్నారు..













Click it and Unblock the Notifications