రాహుల్ ఓ జోకర్: కాంగ్రెస్ నేత ముస్తఫా, తప్పించాలని
కొచ్చి: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి రాహుల్ గాంధీయే కారణమని కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు ఆరోపించారు. ఆయనే కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టిహెచ్ ముస్తఫా. అంతేగాక రాహుల్ను ఓ జోకర్గా అభివర్ణించారు. రాహుల్ గనుక తన పదవులనుంచి స్వచ్ఛందంగా తప్పుకోని పక్షంలో ఆయనను వెంటనే ఆ పదవుల నుంచి తప్పించాలని ముస్తఫా డిమాండ్ చేశారు.
అంతేకాదు, రాహుల్ సోదరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియంకా గాంధీని కాంగ్రెస్కు కొత్త అధ్యక్షురాలుగా చేయాలని టిహెచ్ ముస్తఫా డిమాండ్ చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్ష పదవినుంచి తప్పుకోవాలని, ఒక వేళ ఆయన అలా చేయని పక్షంలో పార్టీయే ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు.
‘రాహుల్ గాంధీ ఒక జోకర్లాగా ప్రవర్తించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కోవడానికి అదే కారణం. ఫ్రధానమంత్రి పాత్ర అంటే చిన్న పిల్లల ఆట కాదు. ప్రజలకు ఆ విషయం బాగా తెలుసు కనుకనే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించారు' అని ముస్తఫా అన్నారు. పార్టీ ఓటమికి రాహుల్ నైతిక బాధ్యత తీసుకుని పదవినుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
రాహుల్ను తప్పించి ప్రియాంకా గాంధీని పార్టీకి కొత్త అధ్యక్షురాలిని చేయాలని ముస్తఫా అన్నారు. కంప్యూటర్ను, ఇంటర్నెట్ను ఉపయోగించి రాహుల్ పని చేసే తీరు, ఆయన ఏం చేసినా పొగడ్డమే పనిగా పెట్టుకున్న కొంతమంది సిడబ్ల్యుసి సభ్యులు ఈ ఓటమికి కారణమన్నారు. మాజీ కేంద్రమంత్రి ఎకె ఆంటోనీ సైతం ఈ వర్గానికి చెందడం దురదృష్టకరమన్నారు. కె కరుణాకరన్ మంత్రివర్గంలో పని చేసిన ముస్తఫా ఐదు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.