''ఆయన'' విషయంలో వెంకయ్యనాయుడు పూర్తిగా విఫలమయ్యారు??
దేశంలో అన్ని కేంద్ర సంస్థలు నిర్వీర్యమైన ప్రస్తుత తరుణంలో ప్రజాస్వామ్యం కష్టంగా ఊపిరి పీల్చుకుంటోందని కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. పార్లమెంటు కూడా నిష్క్రియగా మారిందన్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు ఈడీ సమన్లు రాకుండా రక్షించడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాజ్యసభకు అది విచారకరమైన రోజని వ్యాఖ్యానించారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వివరించారు.

అమిత్ షా ఆరోపణలకు ఖండన
అయోధ్య రామమందిర నిర్మాణానికి వ్యతిరేకంగా సందేశమిచ్చేందుకే ఆగస్టు 5వ తేదీన కాంగ్రెస్ నిరసనలు చేపట్టిందంటూ హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను చిదంబరం ఖండించారు. నిరసన తేదీ నిర్ణయించినప్పుడు ఆ విషయం తమ దృష్టిలో లేదని, ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎంపీలంతా అందుబాటులో ఉంటారన్న కోణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అగ్నిపథ్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంకు సంబంధించి మాత్రమే నిరసనలని గతంలోనే ప్రకటించామని, నేషనల్ హెరాల్డ్ కేసులో పార్టీ అగ్ర నాయకత్వాన్ని కాపాడేందుకే ఈ ఆందోళన చేపట్టారన్న ఆరోపణలను చిదంబరం తోసిపుచ్చారు.

ఎవరి సహకారం వారికి అవసరంలేదు
నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్లు పొందిన నేతలంతా తమను తాము రక్షించుకునే స్థితిలోనే ఉన్నారని, వారికి ఎవరి సహకారం అవసరం లేదన్నారు. తరుచుగా వాయిదాలు పడుతుండటం, ప్రతిపక్షాల నిరసనలతో వర్షాకాల సమావేశాల్లో ఆశించిన స్థాయిలో సాగలేదన్నారు. అందుకే పార్లమెంటు నిష్క్రియగా మారిందన్నారు. దరల పెరుగుదలపై మొదటిరోజే చర్చకు అనుమతించివుంటే రెండువారాలు వృథా అయ్యేవి కాదని చిదంబరం వ్యాఖ్యానించారు.

అధికారపక్షానికి ఆసక్తి లేదు
అధికార పక్షానికి చర్చలపై ఆసక్తి లేదన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, అధిక ధరల తగ్గుదల లాంటి విషయాలపై తీసుకుంటున్న చర్యలను వివరించాల్సింది పోయి మాంద్యం, ఇతర అంశాలపై మాట్లాడారంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను విమర్శించారు. తనకు ఈడీ సమన్లు అందడంపై రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ప్రస్తావించారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో సమన్లు జారీచేయడం ఎంతవరకు సబబని, ప్రజాస్వామ్యం దేశంలో ఉందా? లేదా? అని నిలదీశారు. తర్వాత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ చట్టానికి, న్యాయానికి ఎవరూ అతీతులు కారని, అందరూ సమానమేనని, ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications