జోరుగా కరోనా వ్యాక్సినేషన్: 23 లక్షలమందికి టీకా: మీరెప్పుడు మొదలెడతారు మోడీజీ: రాహుల్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. కరోనా వైరస్ను నిర్మూలించడానికి కొన్ని అగ్రదేశాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ను చేపట్టాయి. చైనా, బ్రిటన్, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ కరోనా వ్యాక్సిన్ను సాధారణ ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఫైజర్-బయోఎన్టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ వినియోగానికి ఆయా దేశాలు అనుమతులు ఇచ్చాయి. త్వరలోనే కెనడా, సౌదీ అరేబియా కూడా కరోనా వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టబోతోన్నాయి.
ఇప్పటికే ఆయా దేశాలకు చెందిన 23 లక్షల మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోన్న ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ భారత్లో ఫిబ్రవరిలో సాధారణ వినియోగానికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఒకవంక కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోంటే.. భారత్లో ఇంకా దీన్ని అందుబాటులోకి తీసుకుని రాకపోవడంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
23 lakh people in the world have already received Covid vaccinations.
— Rahul Gandhi (@RahulGandhi) December 23, 2020
China, US, UK, Russia have started...
India ka number kab ayegaa, Modi ji? pic.twitter.com/cSmT8laNfJ
భారత్లో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ను యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకొస్తామని మొదట్లో హామీలు గుప్పించిన నరేంద్ర మోడీ దాన్ని ఎందుకు నిలబెట్టుకోవట్లేదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా 23 లక్షల మంది ఇప్పటికే కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్నారని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన డేటా వివరాలతో కూడిన ఓ క్లిప్ను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
చైనా, అమెరికా, బ్రిటన్, రష్యా వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టాయని పేర్కొన్నారు. భారత్ నంబర్ ఎప్పుడొస్తుంది మోడీజీ అంటూ రాహుల్ గాంధీ చురకలు అంటించారు. హైదరాబాద్, అహ్మదాబాద్, పుణేల్లో కరోనా వ్యాక్సినేషన్ తయారీ కంపెనీలను సందర్శించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు. వ్యాక్సినేషన్పై కేంద్రం ప్రభుత్వం చేస్తోన్న ప్రకటనలన్నీ ప్రజలను మభ్యపెట్టేవిలా ఉన్నాయని ధ్వజమెత్తారు.