రైతన్న రాహుల్- మౌన సత్యాగ్రహం వేళ..జనం మధ్య
చండీగఢ్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఊపులో ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే జోరును తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే రాష్ట్రాల్లోనూ కొనసాగించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన సంప్రదింపులు జరుపుతోంది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కసరత్తును కూడా ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ మొదలుపెట్టింది కూడా. దీనితో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల హడావుడి నెలకొంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో వరుస భేటీలు ఏర్పాటవుతున్నాయి.

మరోవంక- మోదీ ఇంటి పేరు విషయంలో రాహుల్ గాంధీ పార్లమెంట్లో అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. ఈ వివాదంలో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ గతంలో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు కూడా సమర్థించిన నేపథ్యంలో- కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.
ओ देश मेरे.. 🇮🇳 pic.twitter.com/pQQ7KG7rU6
— Congress (@INCIndia) July 8, 2023
రాహుల్ గాంధీకి సంఘీభావంగా ఈ నెల 12వ తేదీన మౌన సత్యాగ్రహాన్ని పాటించనుంది. అన్ని రాష్ట్రాల్లో గల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాల్లో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాల ముందు మౌన సత్యాగ్రహాన్ని నిర్వహించనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇందులో పాల్గొననున్నారు.

ఈ పరిణామాల మధ్య- రాహుల్ గాంధీ ఇవ్వాళ హర్యానాలోని పానిపట్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. సాధారణ పౌరుడిలా కలియతిరిగారు. ఈ ఉదయం ఆయన బరోదా, మదీన గ్రామాల్లో పర్యటించారు. రైతులతో ముచ్చటించారు. పొలంలో అడుగు పెట్టారు. పొలాన్ని దున్నారు. రైతులతో కలిసి వరినాట్లు వేశారు.

ఈ ఉదయం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి సిమ్లాకు బయలుదేరారు. మార్గమధ్యలో హర్యానాలోని సోనేపట్కు చేరుకోగానే రోడ్డు పక్కన పొలంలో పని చేస్తోన్న రైతుల వద్దకు వెళ్లారు. బరోదా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మదీనా గ్రామానికి వెళ్లారు. రైతులతో ముచ్చటించారు. వారితో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు. సుమారు రెండుగంటల పాటు ఆయన పొలంలోనే గడిపారు. అనంతరం సిమ్లాకు బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications