తొలి వికెట్ కాంగ్రెస్దే: రషీద్ మసూద్పై అనర్హత వేటు
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన తర్వాత తొలి వికెట్ పడింది. అది కాంగ్రెసు పార్టీదే కావడం విశేషం, వైద్య కళాశాల సీట్ల కుంభకోణంలో దోషిగా తేలిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్పై సోమవారం అనర్హత వేటు వేశారు. నేరచరితులపై సుప్రీం ఆదేశాల ప్రకారం పదవి కోల్పోయిన మొదటి నేత రషీద్.
మసూద్ను అనర్హునిగా ప్రకటిస్తూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ షంషేర్ కె.షరీఫ్ అధికారికంగా ప్రకటించినట్టు రాజ్యసభ వర్గాలు తెలిపాయి. రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయినట్టు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటిఫికేషన్ ప్రతిని పంపినట్టు సమాచారం.
రషీద్ 1990-91 మధ్య వీపీ సింగ్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో త్రిపుర మెడికల్ కాలేజీలకు సీట్ల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుదీర్ఘకాలం విచారణ సాగిన అనంతరం మసూద్ను కోర్టు దోషీగా ప్రకటించింది.
దాణా కేసులో దోషిగా తేలిన లాలూ ప్రసాద్పై, జగదీష్ శర్మపై కూడా లాంఛనంగా అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. లోకసభ సచివాలయం నుంచి ఆ మేరకు నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు.