కాంగ్రెస్కు ఎంపీ శశి థరూర్ మార్క్ షాక్..!!
MP Shashi Tharoor :తిరువనంతపురం ఎంపీ శశి థరూర్...అతనో మేధావి. ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి. మంచి రచయిత కూడా. సమస్యలపై అనర్గళంగా మాట్లాడగల సత్తా ఉన్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన కాంగ్రెస్కు ప్రధాన ఆయుధంగా వర్థిల్లాడు. ఇటు ఇంటా అటు బయటా ఏ సబ్జెక్ట్ పైనా అయినా సరే నాన్స్టాప్గా వాదించగల సామర్థ్యం ఉన్న నాయకుడు. పార్లమెంటులో అధికారపక్షాన్ని డిఫెన్స్లోకి నెట్టేయగల కెపాసిటి ఉన్నవాడు. ఇదంతా కాంగ్రెస్ లేదా అక్కడి నాయకులతో సంబంధాలు బాగా ఉన్నప్పటి కథ. కట్ చేస్తే ఒక్కసారిగా కాంగ్రెస్ కంట్లో నలుసుగా తయారయ్యాడు. పొరపచ్చాలు వచ్చాయి. నాడు బీజేపీని తిట్టిన నోటితోనే నేడు పొగడ్తలు కురిపిస్తూ కాంగ్రెస్కు ఇబ్బందిగా మారాడు.
కాంగ్రెస్కు కంట్లో నలుసులా శశి థరూర్
తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కాంగ్రెస్కు కంట్లో నలుసుగా మారాడు.ప్రతిపక్షంలో ఉంటూ అధికార పక్షానికి పరోక్ష మద్దతుగా నిలుస్తుండటంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్కు కొందరు ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇదంతా అటుంచితే తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగాల్సి ఉంది. చర్చలో పాల్గొనాలని కాంగ్రెస్ తరపున తన గొంతును వినిపించాలని ఎంపీ శశి థరూర్ను ఆ పార్టీ హైకమాండ్ ఆదేశించింది. రాహుల్ గాంధీ సైతం చొరవ తీసుకుని శశి థరూర్ మాట్లాడాలని కబురు పంపారు. అయితే శశి థరూర్ మాత్రం చర్చలో తాను పాల్గొనలేనని తేల్చి చెప్పారు.

ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో ఉగ్రమూకలు పర్యాటకులపై తుపాకులు ఎక్కుపెట్టి కాల్చి చంపారు. ఇందుకు ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి పాకిస్తాన్ పై వరుస దాడులు చేసింది. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టుబట్టాయి. చర్చకు స్పీకర్ అనుమతించడంతో ఎవరెవరు ఈ అంశంపై మాట్లాడాలో కాంగ్రస్ జాబితాను సిద్ధం చేసింది. అయితే ఈ జాబితాలో శశి థరూర్ పేరు కనిపించకపోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
జాబితాలో కనిపించని శశి థరూర్ పేరు
లోక్సభలో ప్రతిపక్షనేతగా ఉన్న రాహుల్ గాంధీ, డిప్యూటీ అపొజిషన్ లీడర్ గౌరవ్ గొగాయ్, ఎంపీలు ప్రియాంకా గాంధీ, దీపేందర్ హుడా,పరిణితీ షిండే,షఫి పరాంబిల్, మానిక్కం ఠాగూర్, రాజా బరాద్ల పేర్లు జాబితాలో ఉన్నాయి. వీరంతా 16 గంటల పాటు జరిగే చర్చలో ప్రసంగించనున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ ఎలా నిర్వహించాం, ఎలాంటి పరిస్థితుల్లో భారత్ ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందో వివిధ దేశాలకు వివరించేందుకు కేంద్రం ఒక బృందం ఏర్పాటు చేసింది. అయితే ఆ బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నాయకత్వం వహించడాన్ని ఆ పార్టీ తప్పుబట్టింది.
ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంటులో మాట్లాడాల్సిందిగా శశి థరూర్ను హైకమాండ్ కోరినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించడంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు ఇదే సరైన సమయంగా కాంగ్రెస్ భావిస్తోంది. థరూర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు సైతం హైకమాండ్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఆయనపై శాఖాపరమైన చర్యలు ఉంటాయా లేక కఠిన చర్యలు ఉంటాయా అనేది తెలియలాంటే వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications