బ్రిటీష్ దోపిడికి కలం పోటు.. ఎంపీ శశిథరూర్కు సాహిత్య అకాడమీ అవార్డు
న్యూఢిల్లీ: రాజకీయ వేత్త, రచయిత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ మరో ఘనతను సాధించారు. ఆయన రచించిన యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్: ది బ్రిటీష్ ఎంపైర్ ఇన్ ఇండియా అనే పుస్తకానికి 2019 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ పుస్తకం 2016లో ప్రచురితమైంది.

శశిథరూర్కు సాహిత్య అకాడమీ అవార్డు..
శశిథరూర్ కేరళలోని తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, బుధవారం (డిసెంబర్ 18) కేంద్ర సాహిత్య అకాడమీ 23 భాషలకు సంబంధించిన వార్షిక సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. అందులో శశిథరూర్ ఒకరు కావడం విశేషం.

నాన్ ఫిక్షన్.. బ్రిటీష్ దోపిడీపై..
ఇంగ్లీష్ భాషలో రాసిన నాన్ ఫిక్షన్ యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్: ది బ్రిటీష్ ఎంపైర్ ఇన్ ఇండియా అనే పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. ఏన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ అనే తన పుస్తకంలో భారతదేశంపై బ్రిటీష్ వలస పాలన ప్రభావం గురించి వివరించారు. మనదేశంలో వలసవచ్చిన బ్రిటీషర్లు ఎలా దోపిడీ చేశారని విధానాన్ని ఆయన తెలిపారు. అలాగే మనదేశంలో అప్పటికే అభివృద్ధి చెందివున్న వస్త్ర పరిశ్రమ, ఉక్కు తయారీ, షిప్పింగ్ పరిశ్రమలు, వ్యవసాయం విధానాలను ఎలా నాశనం చేశారనే విషయాన్ని ఆ పుస్తకంలో శశిథరూర్ కూలంకశంగా వివరించారు.

ప్రాచుర్యం పొందిన శశిథరూర్ పుస్తకాలు..
గతంలో వై ఐయామ్ ఏ హిందూ, పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్, ఇంగ్లోరియస్ ఎంపైర్ అనే పుస్తకాలను కూడా రచించారు. ఆ పుస్తకాలు కూడా బహుళ ప్రజాదరణ పొందాయి.
లండన్లో జన్మించిన శశి థరూర్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫాన్స్ కాలేజ్ నుంచి 1975లో పట్టబద్రులయ్యారు. 1978లో టఫ్ట్ యూనివర్సిటీలోని ఫ్టెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లోమసి నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫైర్స్లో డాక్టరేట్ సాధించారు. అనంతరం ఐక్యరాజ్య సమితిలో కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ విభాగంలో సెక్రటరీ జనరల్గా సేవలందించారు. అలాగే యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ సహాయమంత్రిగా పనిచేశారు.

అత్యుత్తమ పుస్తకాలకే సాహిత్య అకాడమీ అవార్డు
1954 నుంచి సాహిత్య అకాడమీ అవార్డులను ఇవ్వడం జరుగుతోంది. ప్రధాన భారతీయ భాషలలో ప్రచురించబడిన సాహిత్య యోగ్యత కలిగిన అత్యుత్తమ పుస్తకాలను గుర్తించి ఈ అవార్డులను అందజేయడం జరుగుతోంది. న్యూఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నారు. అవార్డుగా చెక్కిన రాగి ఫలకం ఇవ్వడం జరుగుతుంది. శాలువా కప్పి సత్కరిస్తారు. అంతేగాక, రూ. లక్ష రూపాయల చెక్కును కూడా అందజేస్తారు.












Click it and Unblock the Notifications