రాష్ట్రపతికి కాంగ్రెస్ ఎంపీల ఫిర్యాదు-అగ్నిపథ్, రాహుల్ పై ఈడీ విచారణ, ఢిల్లీ పోలీసుల తీరుపై
దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్న అగ్నిపథ్ పథకం, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీపై ఈడీ విచారణ, ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలపై పోలీసుల దాడులపై ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు కాంగ్రెస్ ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది. ఈ మూడు అంశాలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
ఢిల్లీలో రాష్ట్రపతి కోవింద్ ను కలిసేందుకు కాంగ్రెస్ ఎంపీలంతా అపాయింట్ మెంట్ కోరారు. కానీ ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలకు మాత్రమే కోవింద్ అవకాశం ఇచ్చారు. దీంతో జైరాం రమేష్, చిదంబరం సహా ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్రపతిని కలిశారు. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం, దాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనలు, నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాందీని టార్గెట్ చేస్తూ కేంద్రం ఈడీ విచారణ చేయిస్తోందని రాష్ట్రపతికి ఎంపీలు ఫిర్యాదు చేశారు. అనంతరం ఢిల్లీలో రాహుల్ కు మద్దతుగా ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీల్ని ఢిల్లీ పోలీసులు చితకబాదడంపైనా ఎంపీలు ఫిర్యాదు చేశారు. పార్లమెంటులో భాగమైన రాష్ట్రపతి ఆయా అంశాలపై స్పందించి ఎంపీల ప్రయోజనాల్ని కాపాడాలని కాంగ్రెస్ నేతలు కోరారు.
ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలపై పోలీసుల దాడుల వ్యవహారాన్ని పార్లమెంటు సభా హక్కుల కమిటీకి పంపాలని రాష్ట్రపతిని కోరినట్లు భేటీ అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం వెల్లడించారు. త్వరలో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతితో చర్చించిన అంశాలపై చర్చకు పట్టుబట్టాలని కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఒంటెద్దు పోకడలకు నిరసనగా పార్లమెంటు సమావేశాల్ని అడ్డుకునేందుకు వారు సిద్ధమవుతున్నారు.