రాజ్యసభకు ప్రియాంక గాంధీ.. ఛత్తీస్గఢ్ నుంచి ఎన్నిక.. కాంగ్రెస్ సరికొత్త వ్యూహం
లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ప్రతిపక్ష హోదా కోల్పోయి.. మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవని కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా భారీ మార్పులకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రాను రాజ్యసభకు పంపబోతున్నట్లు సమాచారం. ఛత్తీస్ గఢ్ కోటా నుంచి ప్రియాంకను పెద్దల సభకు పంపే అంశాన్ని పార్టీ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
నమ్మకం పెంచేదుకే..
గతేడాది లోక్ సభ ఎన్నికలకు ముందు సడెన్ గా రాజకీయ రంగప్రవేశం చేసిన ప్రియాంక గాంధీ.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. తర్వాతి కాలంలో ఉత్తరప్రదేశ్ ఈస్ట్ విభాగానికి ఇన్ చార్జి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా యూపీలో వరుస పర్యటనను చేస్తూ వీలైనంత ఎక్కువగా ప్రజల మధ్యే ఉండేందుకు ప్రియాంక ప్రయత్నిస్తున్నారు. 2022లో జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే ప్రభావం చూపాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రియాంకను చట్టసభలకు పంపడం ద్వారా కార్యకర్తలు, ప్రజల్లో ఆమె పట్ల మరింత నమ్మకాన్ని పెంపొందించొచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.

త్వరలో సీట్లు ఖాళీ..
రాజ్యసభ సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లైన అంబికా సోనీ, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ సింగ్ పదవీకాలం త్వరలో ముగియనుంది. ఆ ఖాళీలను ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి భర్తీ చేయనున్నారు. రాజ్యసభకు ఎప్పటిలాగే పెద్దలను కూడాకుండా ప్రియాంక లాంటి మధ్య వయస్కుల్ని పంపాలని సోనియా నిర్ణయించినట్లు తెలిసింది. ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నేతలు కూడా ఈ మేరకు డిమాండ్ ను అధినేత్రి ముందుంచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రియాంక రాజ్యసభ ఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు.












Click it and Unblock the Notifications