మోడీ! మౌనం వీడండి, దేశం చూస్తోంది: రాహుల్ గాంధీ, ఎవరినీ వదలమని యోగి
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ నిరసనలను తీవ్రతరం చేసింది. కథువా, ఉన్నావ్ అత్యాచారాల కేసుల నేపథ్యంలో గురువారం రాత్రి రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
మహిళలకు రక్షణ కల్పించాలనే డిమాండుతో ఈ ప్రదర్శన సాగింది. ఈ కేసులపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. తాజాగా, రాహుల్ ఓ ట్వీట్ కూడా చేశారు. ఈ ఘటనలపై ప్రధాని స్పందించాలని డిమాండ్ చేశారు.
'మిస్టర్ ప్రధానమంత్రి, మీ మౌనం ఆమోదయోగ్యం కాదు.
1. మహిళలు, పిల్లలపై పెరుగుతున్న హింసాకాండ గురించి మీరు ఏమనుకుంటున్నారు?
2. అత్యాచారాలు, హత్యలలో నిందితులను ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?
భారత దేశం ఎదురు చూస్తోంది
మాట్లాడండి' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే: యోగి
ఉన్నావ్ సామూహిక అత్యాచారం కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించామని చెప్పారు. సీబీఐ ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేస్తుందని నమ్ముతున్నానని చెప్పారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు. నిందితులు ఎంతటి వారైనా, ఎవరికి చెందిన వారు అయినా వదిలి పెట్టేది లేదన్నారు.
కాగా, ఉన్నావ్ రేప్ కేసులో ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని సీఎం యోగి నిర్ణయించుకున్నప్పటికీ ప్రముఖ నేత ఒత్తిడి మేరకు ఆలస్యం అయిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు.












Click it and Unblock the Notifications