కాంగ్రెస్ ఎమ్మెల్యేతో యెడ్డి కొడుకు ఫోన్ సంభాషణ: బిజెపికి ఓటేస్తే రూ.5 కోట్లు, మంత్రి పదవి
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో విశ్వాస పరీక్షలో విజయం సాధించేందుకుగాను బిజెపి అనేక అక్రమాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభాలకు గురిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. తాజాగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప తనయుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓ ఆడియోను శనివారం నాడు విడుదల చేసింది.
యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర తమ ఎమ్మెల్యేలకు రూ.5కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. విజయేంద్ర మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఆడియో క్లిప్ ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. యడ్యూరప్ప బలపరీక్షకు సిద్దమైన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఆడియో క్లిప్ ను విడుదల చేయడం సంచలనంగా మారింది.
ఈ వీడియో క్లిప్ కంటే ముందే మే 18వ తేది రాత్రి కూడ కాంగ్రెస్ పార్టీ మరో ఆడియో క్లిప్ ను విడుదల చేసింది. రాయచూర గ్రామీణ ఎమ్మెల్యే బసవగౌడ దద్దల్ను బిజెపికి చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఫోన్లో సంప్రదించినట్టుగా ఆడియో సంభాషణను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
కర్ణాటకలో ప్రభుత్వాన్ని నిలుపుకొనేందుకు బిజెపి అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇందులో భాగంగానే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతోందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే రెండు ఆడియో క్లిప్పులను కూడ విడుదల చేశారు.